ఆ ఇద్దరి గుప్పెట్లో కోడి
- NVS PRASAD
- 6 days ago
- 3 min read
ఇష్టారాజ్యంగా పేపరుకు ఇచ్చే రేట్లు
నెలకు రూ.50 కోట్లకు పైగా దందా
పక్క జిల్లాల కంటే మనకే ధర ఎక్కువ
ఒడిశాలో చౌకగా దొరుకుతున్న బ్రాయిలర్ చికెన్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఈరోజు మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.275. మనం నేరుగా కొనుగోలు చేయడానికి వెళ్తే రూ.200లే కిలోకు తీసుకుంటున్నారు. అబ్బా.. పేపరు రేటు కంటే రూ.75 కిలో దగ్గర తగ్గుతుందని మురిసిపోవడం మనవంతవుతుంది. కేజీ దగ్గర రూ.75 తగ్గుతుందని, అది కూడా బేరమాడకుండానే ఇచ్చేస్తున్నారంటూ కిలోలకు కిలోలు పట్టుకెళిపోతున్న కుటుంబాలు మనకు తెలుసు. ఈ తరం పిల్లలు బ్రాయిలర్ చికెన్ తప్ప మరోటి తినడానికి ఇష్టపడకపోవడం కూడా మరో కారణం. అయితే మన మార్కెట్లో ఇలా పేపరు రేటు కంటే తక్కువకు చికెన్ అమ్మేస్తున్నవారు త్యాగమూర్తులనుకొని అవార్డులో, రివార్డులో ఇచ్చే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఎందుకంటే.. అసలు తెల్లారి లేచి పేపరులో కనిపించే చికెన్ ధరే ఓ పెద్ద కుంభకోణం. పేపరులో ఇలా ఒక అంకెను ప్రకటించడం ద్వారా ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే నెలకు రూ.50 కోట్లు సిండికేట్ సంపాదిస్తుందంటే ఆశ్చర్యం కలగకమానదు. కోడి మీద ఈకలు పీకడమనుకోపోతే బయటి ప్రపంచానికి పట్టని అతి పెద్ద కుంభకోణం బ్రాయిలర్ కోడి రూపంలో నడుస్తుంది. ఎంతసేపు పప్పులు, ఉప్పులు, నూనెల ధరలు పెరిగిపోయాయని గగ్గోలు పెట్టి, ముక్క లేకపోతే ముద్ద దిగని మనం మనకు తెలియకుండానే నెలలో రూ.50 కోట్లు బ్రాయిలర్ సిండికేట్కు అప్పగించేస్తున్నాం.
అసలు పేపరు రేటేంటి..?
ఉదయం వచ్చే పత్రికల్లో చికెన్ ధరలంటూ ప్రతీ జిల్లా ఎడిషన్లోనూ లైవ్ కోడి ఎంత? డ్రెస్డ్ ఎంత? స్కిన్లెస్ ఎంత? అనే ఒక రేటును ప్రచురిస్తారు. అంటే మార్కెట్లో ఆ రోజు అంతకు మించి చికెన్ ఎక్కువ ధర వసూలు చేయకూడదనేది వారి ఉద్దేశం. కానీ అసలు ఈ రేటులోనే తేడా ఉంది. పత్రికల్లో కిలో ధర ఇంత అని ఇతిమిద్దంగా ప్రకటించేది ఎవరు? అనేది ఆరాతీస్తే, అసలు కుంభకోణం ఎవరు చేస్తున్నారో అర్థమవుతుంది. పత్రికల్లో ప్రకటించే రేటుకు ఏమాత్రం శాస్త్రీయత లేదు. కోడిపిల్లను ఇంతకు కొన్నాం, ఇంత మేపాం, ఇంతకు పెంచాం, ఇన్ని చనిపోయాయి, ఇన్ని మిగిలాయి.. వంటి లెక్కలు వేసుకొని కిలో ఇంత అని లెక్కగడతారనుకుంటే పొరబడినట్టే. ప్రతీనెల తాము అక్రమంగా ఎంత సంపాదించాలో ముందే ఫిక్స్ చేసుకొని, ఆ మేరకు చికెన్ ధరలు పేపరుకు ప్రకటిస్తున్నారు. రిటైల్ వర్తకులు ఇంకా తెలివైనవారు కాబట్టి పేపరు ధర కంటే తక్కువకు అమ్ముతున్నామని బోర్డు పెట్టి మరీ కిలో కొనేవారి చేత రెండు కిలోలు కొనిపిస్తున్నారు. అసలు ఈ రేట్లు ఎవరు నిర్ణయించాలి?
ఇద్దరి చేతుల్లో చికెన్ ధరలు
శ్రీకాకుళం నగరంలో కనీసం చికెన్ వంటకాలు అమ్మే హోటళ్లు చిన్నా, పెద్దా కలిపి 200 పైబడి ఉంటాయి. అలాగే చికెన్ అమ్మే దుకాణాలు కూడా వందకు పైగా ఉంటాయి. ఇంతమంది ఇన్ని రకాలుగా, ఇన్ని దరలకు అమ్ముతున్నా అంతిమంగా లబ్ధి పొందింది మాత్రం ఇద్దరే. వీరే జిల్లాకు సరిపడా కోళ్లను తెప్పించి అందరికీ సరఫరా చేస్తున్నారు. వీరి వద్ద అంతో ఇంతో తక్కువకు కొనుక్కొని మరికొందరు సబ్వ్యాపారం చేస్తున్నారు. అయితే కోడి ధర పేపరుకు ఎంత ఇవ్వాలనేది నగరంలో ఉన్న కేవలం ఇద్దరు నిర్ణయిస్తున్నారు. వీరు ఎంత చెబితే అంతే. సగటు మాంసప్రియుడు పేపరు రేటుకు వచ్చినందుకు మురిసిపోవడమో, పేపరు రేటుకంటే తగ్గిస్తున్నందుకు ఎగిరి గంతేయడమో చేస్తున్నాడు గానీ, అసలు బ్రాయిలర్ కోడేంటి? దాని ధరేంటి? అనేవైపు ఆలోచించడు. సరిగ్గా ఇక్కడే, ఈ బలహీనతనే ఆసరాగా తీసుకొని రూ.50 కోట్లుపైన మూటగడుతున్నారు. పోనీ ఈ కోడి ధరను నిర్ణయిస్తున్న ఇద్దరూ కోడిని పెంచే రైతులా? అంటే.. అదీ కాదు. ఈ రాష్ట్రమంతటికీ కోళ్లు ఎక్కడి నుంచి సరఫరా అవుతాయో, వీరికి కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. కానీ జిల్లా పౌల్ట్రీ యజమానుల సంఘం ముసుగులో వీరు పేపరు రేటు నిర్ణయిస్తున్నారు. పేపరు రేటుకు, మార్కెట్ రేటుకు వ్యత్యాసం ఉన్నట్టే మార్కెట్లో రూ.200కు కిలో విక్రయిస్తున్న దానికంటే మరో రూ.45 తక్కువకు కిలో చికెన్ దొరకాలి. ఆ మేరకే పేపరులో ప్రకటన ఇవ్వాలి. కానీ వారాల తరబడి పేపరు రేటును మార్చకుండా సొమ్ములు నొక్కేస్తున్నారు. వాస్తవానికి కిలో స్కిన్లెస్ చికెన్ రూ.150కి మించి ఉండదు. కానీ దాన్నే రూ.275 కింద చూపిస్తున్నారు.
మన జిల్లాలోనే అధికం
రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే శ్రీకాకుళం జిల్లాలోనే చికెన్ రేటు అధికంగా ఉంది. కారణం.. కేవలం ఇక్కడ ఇద్దరి చేతుల్లోనే ఈ మార్కెట్ ఉండటం. దీనికి తోడు నగరంలో హోటళ్లు, సాధారణ వినియోగం ఎక్కువ. నగరంలో ఒకరిద్దరు పెద్ద రిటైల్ వ్యాపారులు పేపరు ధరకంటే తక్కువకు అమ్ముతున్నా, మిగిలినవారంతా పేపరు రేటు పట్టుకునే వేలాడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడవుతున్న చికెన్ ధరలన్నీ సిండికేట్ సృష్టించినదే. పౌల్ట్రీ అసోసియేషన్ ఏరోజుకారోజు చికెన్ ధరలను నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ కాంపిటేషన్ లేకపోవడంతో ఇద్దరు ఇష్టారాజ్యంగా ఈ రేటును ప్రకటిస్తున్నారు. కిలో కొనుగోలు వద్ద ప్రతీ వినియోగదారుడు రూ.70 పైచిలుకు నష్టపోతున్నాడు. మన పక్క జిల్లా విజయనగరంలో పేపరు రేటు మనకంటే రూ.15 నుంచి రూ.20 తక్కువ ఉంటుంది. ఒక్క ఆదివారమే జిల్లాలో సగటున 15 లక్షల కిలోలు చికెన్ విక్రయిస్తారు. ఇక వెన్కాబ్, సుగుణ, స్నేహ వంటి సంస్థలు కోళ్లను సరఫరా చేస్తున్నాయని, అవి కార్పొరేట్ స్థాయిలో ఉంటాయి కాబట్టి రేటు ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. ఒక కోడిని పట్టుకొని అది వెన్కాబా, సుగుణావా అనేది పోల్చడానికి మార్కెట్లో యంత్రాలు ఉన్నాయా? ఇది కాకుండా బర్డ్ఫ్లూ వంటి వ్యాధి వచ్చినప్పుడు అయ్యో చికెన్ వ్యాపారులు నష్టపోతున్నారన్న సానుభూతి ఒకటి. పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతినకుండా ప్రభుత్వం చికెన్ మేళా నిర్వహించి వండి వార్చడాలు చేయడంతో బర్డ్ఫ్లూ వచ్చినా కూడా ఎక్కడా రేటు తగ్గడం కనపడలేదు. ఏ వ్యాపారీ నష్టపోయినట్లు భావించక్కర్లేదు. ఎందుకంటే.. ఒక బ్రాయిలర్ కోడి మీద కోట్లు గడిరచి ప్రజల్ని నిలువుదోపిడీ చేస్తున్నవారే ఎక్కువమంది ఉన్నారు. మన జిల్లాతో బోర్డర్ పంచుకున్న ఒడిశాలో ఏడాదిలో 300 రోజులు చికెన్ ధర ఒకేలా ఉంటుంది. ఎండాకాలం, వర్షాకాలం అనే తేడా లేకుండా ఒకే ధరకు అమ్ముతున్నారు. శ్రీకాకుళం మార్కెట్లో మాత్రం ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కోళ్లను తయారుచేసేది, పెంచేది, సరఫరా చేసేది కేవలం కొన్ని కార్పొరేట్ సంస్థలే. మధ్యలో దళారులుగా వచ్చి మనకు విక్రయించడం కోసం ఒక రేటును, హోటళ్లకు ఇవ్వడం కోసం మరో రేటు, రిటైలర్స్ ఇవ్వడానికి ఇంకో రేటు పెట్టి, ఇదేమని అడిగితే రకరకాల పేర్లు చెప్పి దోచుకుంటున్న వైనంపై ప్రభుత్వం ఇంతవరకు దృష్టి సారించలేదు.
Comments