ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా..?!
- DV RAMANA

- Jun 18, 2025
- 2 min read

ఇరాన్ నుంచి తనకు అణుదాడి ముప్పు ఉందన్న ఆరోపణతో ఆ దేశంపై ఇజ్రాయెల్ ఏకపక్షంగా సైనిక చర్యకు దిగడం పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారి యుద్ధరూపం సంతరించుకుంది. అక్కడితో ఆగకపోగా ప్రపంచ యుద్ధం స్థాయికి చేరుకుంటోంది. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్కు వెన్ను కాస్తుండగా తాజాగా కెనడా లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా దాని సభ్య దేశాలన్నీ ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించాయి. మరో వైపు 21 అరబ్, ఇస్లామిక్ దేశాల సమాఖ్య ఇరాన్కు అండగా నిలిచింది. ఇజ్రాయెల్ దుందుడుకు దాడు లను ఖండిస్తూ ఇరాన్కు పూర్తి మద్దతు ప్రకటించింది. యుద్ధంలో ఇజ్రాయెల్ తరఫున ఇప్పటికే ఇంగ్లండ్, అమెరికా తమ సైనిక సంపత్తిని ఇరాన్ సరిహద్దులోకి తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రతి దేశం ఏదో ఒక పక్షం వహించి యుద్ధరంగంలోకి దిగుతున్న తరుణంలో భారతదేశం వైఖరి ఎలా ఉంటుంది? ఏ పక్షం వహిస్తుంది?? అన్న సందేహాలు కలగడం సహజం. వాస్తవంగా చెప్పాలంటే భారత్ శాంతికాముక దేశం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ అలీన విధానాన్ని అనుసరిస్తోంది. అంటే ఇతర దేశాల పట్ల స్నేహసంబంధాలు నెరపుతూనే.. యుద్ధం వంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు తటస్థ వైఖరి అవలం భిస్తుంది. ప్రస్తుత ఇరాన్`ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల్లోనూ ఇరుదేశాలతో సమాన దూరం పాటించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది అంత ఈజీ కాదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. అటు ఇరాన్తో, ఇటు ఇజ్రాయెల్తో భారతదేశానికి దశాబ్దాల స్నేహ సంబంధాలతో పాటు ఆర్థిక, వాణిజ్య సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ కొన్ని దశా బ్దాలుగా భారత్కు కీలక రక్షణరంగ భాగస్వామిగా ఉంటోంది. భద్రత, రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల నియంత్రణలో సహకారిస్తోంది. 1992 నుంచి ఇరుదేశాలు దౌత్య సంబంధాలు కొనసాగిస్తూ పరస్పర అవగాహనతో పనిచేస్తున్నాయి. 1948లో యూదు రాజ్యం ఏర్పడినప్పటి నుంచీ ఈ బంధం బలపడుతూ వచ్చింది. అదే సమయంలో ఇతర దేశాలతో సంబంధాలపై ఇది ప్రభావం చూప కుండా భారత్ సంయమనం పాటిస్తూ వస్తోంది. మరోవైపు భారత్ తన ముడి చమురు అవసరాలను చాలావరకు ఇరాన్ తీరుస్తోంది. 2018కి ముందు భారత్ తన ముడి చమురు దిగుమతుల్లో పదో వంతును ఇరాన్ నుంచే పొందేది. అయితే గత ఐదేళ్లుగా ఇరాన్పై ఆధారపడటం తగ్గించుకుంటోంది. ఇరాన్ చమురు దిగుమతిదారుల్లో చైనా మొదటి స్థానంలో నిలవడమే దీనికి కారణం. ఇరాన్తో సంబం ధాలను విస్తరించుకోవడం ద్వారా చైనా అనేక వ్యూహాత్మక ప్రయోజనాలు పొందుతోంది. అయినా ఇప్పటికీ ఇరాన్ నుంచి గణనీయంగానే భారత్ చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇంకా ఇతర భౌగోళిక, వ్యూహాత్మక అంశాలు కూడా ఇరు దేశాల మధ్య బంధాన్ని పెనవేస్తున్నాయి. మధ్య ఆసియాతో సంబంధాల బలోపేతానికి చాబహార్ ఓడరేవు కీలకం. ఈ ఓడరేవును ప్రస్తుతం ఇండియాయే నిర్వహిస్తోంది. అంత ర్జాతీయ ఉత్తర-దక్షిణ కారిడార్ అభివృద్ధిపై కూడా భారత్ దృష్టి సారిస్తోంది. దక్షిణాసియాలో ఇరాన్ ఓ కీలక శక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రష్యా, చైనా దానికి మిత్రదేశాలుగా కొనసాగు తున్నాయి. భారత్కు కూడా ఇరాన్ వ్యూహాత్మక ప్రాధాన్యత ఇస్తోంది. ఇరాన్ నుంచి చమరు దిగుమతు లపై అమెరికా విధించిన ఆంక్షలను భారత్ గతంలో సమర్ధించింది. ఆ నిర్ణయం కారణంగా పడే ప్రభావం నుంచి బయటపడాలని ఇప్పుడు ప్రయత్నిస్తోంది. దక్షిణాసియాలోని శక్తివంతమైన దేశాలతో సంబంధాలు నెలకొల్పుకొని తన ప్రయోజనాలను విస్తరించుకోవాలని భారత్ కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయిల్ రెండిరటికీ భారత్ భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక ప్రాధాన్యత ఇస్తోంది. వీటిని దృష్టిలో ఉంచుకునే ఇజ్రాయిల్-ఇరాన్ ఘర్షణల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. అందుకే దౌత్యపరమైన ప్రతిస్పందన తెలియజేసే విషయంలో మల్లగుల్లాలు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న ఘర్షణలను తేలికగా తీసుకోవడానికి వీలు లేదు. ఏమాత్రం మాట జారినా, నిర్ణయం మారినా పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే ఇటువంటి సందర్భాల్లో భారత్ దౌత్యపరంగా ఒకే మాట చెబుతుంటుంది. ఘర్షణలు, దాడులతో కాకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తుంది. మరి ఇరాన్, ఇజ్రాయెల్ విషయం లోనూ అదే వైఖరి తీసుకుంటుందని భావించాల్సి ఉంటుంది.










Comments