ఉద్యమ పార్టీని ఊపేస్తున్న వారసత్వ ఉప్పెన
- DV RAMANA
- 5 days ago
- 2 min read

ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టిస్తే ఏమొస్తుంది? లిక్కర్ స్కామ్లో జైలుకెళ్లినప్పుడు పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటే వద్దని వారించారు.. మరి ఇప్పుడెందుకు పొగ పెడు తున్నారు? పార్టీ అధినేత కేసీఆర్కు తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారు? అంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కవిత తాజాగా ప్రశ్నాస్త్రాలు సంధించడంతో పార్టీలోనూ, కేసీఆర్ కుటుంబంలోనూ తలెత్తిన వివాదం టీ కప్పులో తుపానులా సమసిపోతుందనుకున్న కార్యకర్తల ఆశలను నీరుగార్చింది. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వివాదానికి పార్టీపై పెత్తనంలో వాటాల విషయంలో అధినేత కుటుంబంలో తలెత్తిన విభేదాలే కారణమని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వాటాల విషయం తేల్చాలంటూ కవిత కేసీఆర్కు రాసిన లేఖ లీక్ కావడంతో కేసీఆర్ కుటుంబంలోనూ తద్వారా పార్టీలోనూ విభేదాలు రేగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అధికారం కోల్పోయి పరిస్థితి దిగజారిన తరుణంలో ప్రారంభమైన ఆధిపత్య పోరు పార్టీ పరువును మరింతగా దిగజారుస్తుందన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది. అందుకే ఈ వివాదాన్ని మొగ్గలోనే తుంచేయడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నాలు విఫలమ య్యాయి. తన అన్న, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఉన్న కేటీఆర్ను టార్గెట్ చేసుకున్న కవిత మరింత రెచ్చిపోకుండా సర్దిచెప్పేందుకు తన సన్నిహితుడైన ఎంపీ దామోదరరావుతో పాటు మరొకరిని కేసీఆర్ రాయబారం పంపినా, స్వయంగా కేసీఆరే ఫోనులో నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె ఏమాత్రం మెత్తబడలేదు. మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని, జూన్ మొదటి వారంలో అది కార్యరూపం దాలుస్తుందని కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థ నేతలు ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్లో చేరేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఒక ప్రధాన పత్రిక రాస్తున్న కథనాలు కలకలం రేపుతున్నాయి. తొలి కథనం ప్రచురితమైన వెంటనే కవిత దాన్ని తీవ్రంగా ఖండిరచినా.. ఆ కథనాలు ఆగకపోవడం గమనార్హం. దాంతో నిప్పు లేనిదే పొగ రాదు కదా? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో అమెరికాలో ఉన్న కవిత.. తన తండ్రి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన కొన్నాళ వరకు అటువైపు చూడలేదు. ఉద్యమం తారస్థాయికి చేరుకున్న తరుణంలో అమెరికా నుంచి వచ్చేసి టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా తెలంగాణ జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిరది. ఆ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన ఆమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే సోదరుడు కేటీఆర్ను బీఆర్ఎస్కు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్, తనను మాత్రం పార్టీలో ఎటువంటి పాత్ర లేకుండా చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపో యారని అంటున్నారు. తమ ప్రభుత్వం లేని పరిస్థితుల్లో కనీసం పార్టీలోనైనా అన్నతో సమానంగా ప్రాధాన్యం, ప్రాతినిధ్యం కల్పించాలని ఆమె కోరుకుంటున్నారు. అలా జరక్కపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. లిక్కర్ స్కాంలో చాన్నాళ్లు జైలు ఉండి బయటకొచ్చిన తర్వాత కొన్నాళ్లు మౌనంగా ఉన్న కవిత పార్టీలో తన పాత్రను, అధికారాన్ని దక్కించుకునేందుకు తండ్రి కేసీఆర్పైనే లేఖ రూపంలో ధిక్కార స్వరం వినిపించడంతో పార్టీలోనూ, కేసీఆర్ కుటుంబంలోనూ కలకలం రేగింది. బీజేపీతో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూ.. హన్మకొండలో జరిగిన సిల్వర్ జూబ్లీ సభలో కూడా దానిపై క్లారిటీ ఇవ్వలేదని ఎత్తిచూపారు. కొన్నాళ్లుగా పార్టీ నిర్వహిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు సంచలన విషయాలు లేవనెత్తిన ఆమె పార్టీలో తన పాత్ర, బాధ్యత, అధికారం ఏమిటన్న ప్రశ్నలను కూడా సంధించారు. తనకు బాధ్యతలు అప్పగించకపోతే తన దారి తాను చూసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఉద్యమం నుంచి పార్టీతోనే ఉన్న తనను విస్మ రిస్తున్నారన్న ఆక్రోశం ఆమె రాసిన లేఖలో ప్రస్ఫుటమైంది. దీనిపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందిస్తూ ఇలా రచ్చకెక్కడాన్ని తప్పుపట్టారు. అయితే తాను రాసిన లేఖను బయటపెట్టినవారే దీనికి కారకులంటూ కౌంటర్ ఇచ్చిన కవిత తండ్రి చేసిన రాజీ యత్నాలను కూడా తిరస్కరించడంతో ఈ వారసత్వ ఉప్పెన పార్టీని ముంచేస్తుందేమోనని సగటు కార్యకర్తలు మథనపడుతున్నారు.
Comentários