కమండలంలో కలిసిపోయిన ‘మండల్’
- NVS PRASAD

- 4 days ago
- 3 min read
బీహార్లో రెండు ‘పరివార’ల కథ
ప్రాంతీయ పార్టీల బలాన్ని మింగేస్తున్న బీజేపీ
మరికొన్నేళ్లలో బాబు కూడా నితీష్ బాటలోనే

ఉత్తరాది రాజకీయం తరచుగా ‘మండల్ వర్సెస్ కమండల్’గా ఉండేది. అంటే ఓబీసీల స్వయంప్రతిపత్తి (మండల్), హిందూ కులాలన్నింటినీ ఏకం చేయాలనే హిందుత్వ పోరాటం (కమండల్) మధ్య ఘర్షణన్నమాట. ఎప్ప్పుడైతే బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ ముందువరుసకు వచ్చారో తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కమండల్ (బీజేపీ) తో పొత్తు పెట్టుకునే మండల్ రాజకీయం చేశారు. ఇప్ప్పుడు ఏకంగా తన ముఖ్యమంత్రి పదవిని వదులుకొని రాజ్యసభకు వెళ్లడం ద్వారా మండల్ కాస్త కమండలంలో కలిసిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి.
నరేంద్ర మోదీ నాయకత్వంలో, బీజేపీ కులాల మధ్య పోటీని, సర్దుబాటును తన సొంత ‘పరివార’ వ్యవహారంగా మార్చేసింది. దీంతో ఇప్పుడు పార్టీల మధ్య పోరాటంగా కాకుండా, సంఘ్ పరివార్ లోపలి వ్యవహారంగా మండల్ మారింది. నితీష్కుమార్ రాజకీయ సన్యాసానికి సిద్ధమవుతుండగా, జనతా పరివార్ అంతరించిపోయే దిశగా సాగుతోంది. మరోవైపు సంఘ్ పరివార్ ప్రాబల్యం పెరుగుతోంది. ఇప్పుడు ‘మండల’ రాజకీయం ‘కమండల’లో ఒక భాగమైపోయింది.
1970లలో బీహార్లో జయప్రకాష్ నారాయణ్ (జేపీ) ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన నితీష్ కుమార్ రాజకీయ ప్రస్థానం ముగింపు దశకు చేరుకుంది. ఆ ఉద్యమం అప్పట్లో సంఘ్ పరివార్, జనతా పరివార్ అనే రెండు రాజకీయ కుటుంబాల కలయికగా ఉండేది. జేపీ ఉద్యమం రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధిపత్యానికి, అగ్రవర్ణాల సామాజిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) రాజకీయ ఏకీకరణకు పునాది వేసింది.
బీహార్లోని ఓబీసీ రాజకీయం కొన్ని దశాబ్దాలుగా అనేక మార్పులకు లోనైంది. రాష్ట్రంలో అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని సవాలు చేయడంలో యాదవ్, కుర్మీ, కోయెరీ అనే మూడు సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషించాయి. నితీష్ కుమార్ కుర్మీ వర్గానికి చెందినవారు. జనతా పరివార్లో చాలా కాలం పాటు లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత రెండో స్థానంలో ఉన్న నితీష్, 1994లో విడిపోయి సమతా పార్టీని స్థాపించారు. ఇది తర్వాత జనతాదళ్ (యునైటెడ్)గా రూపాంతరం చెందింది. 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన, ఇప్పుడు రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన వేదిక నుంచి నిష్క్రమించడం అనేది గత అర్థ శతాబ్ద కాలంగా సంఘ్ పరివార్, జనతా పరివార్ మధ్య జరిగిన పరస్పర చర్యల ద్వారా రూపుదిద్దుకున్న సామాజిక, రాజకీయ ప్రక్రియ ఇప్ప్పుడు ముగింపును సూచిస్తుంది. దీనితో, జనతా పరివార్ అంతర్ధానం దగ్గరపడినట్లు కనిపిస్తోంది, ఇది సంఘ్ పరివార్ సాధించిన విజయం.
సంఘ్ పరివార్ ఉధృతి
2005 నాటికి లాలూప్రసాద్ యాదవ్ ఓబీసీ బేస్ బలహీనపడి, ఆయన వద్ద కేవలం యాదవులు, ముస్లింలు మాత్రమే మిగిలారు. అదే సమయంలో నితీష్ కుమార్ యాదవేతర ఓబీసీలు, దళితులను తనవైపు తిప్పుకున్నారు. 2005లో ఆర్జేడీ ఓడిపోయింది, నితీష్ కుమార్ బీజేపీ-జేడీయూ కూటమి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రారంభంలో నితీష్కుమార్ జాతీయ నాయకుడిగా నరేంద్ర మోదీ ఎదుగుదలను వ్యతిరేకించినప్పటికీ, త్వరలోనే లొంగిపోక తప్పలేదు. 2014లో మోదీ స్వయంగా ఒక ఓబీసీ నాయకుడిగా బీహార్లో అడుగుపెట్టారు. జనతా పరివార్ క్లెయిమ్ చేసిన ఓబీసీ ఓటు బ్యాంకునే ఆయన సొంతం చేసుకున్నారు. అప్ప్పుడు ఓటర్లు, ఇప్ప్పుడు నాయకుల విలీన ప్రక్రియ పూర్తయింది. నితీష్ తర్వాత ముఖ్యమంత్రి కూడా ఓబీసీ వర్గం నుండే వచ్చే అవకాశం ఉంది. బీజేపీ ప్రతి స్థాయిలోనూ ఓబీసీ నాయకులను సిద్ధం చేసుకుంది. ఒకప్ప్పుడు బీజేపీ అగ్రకులాలకు చెందిందనే అపోహ ఉండేది. కుల గమనాలు ఇప్పుడు హిందుత్వ పరిధిలోనే పరిష్కరించబడుతున్నాయి. ఇది ఇకపై ‘సామాజిక న్యాయం వర్సెస్ హిందుత్వ’ కాదు, అలాగే ‘మండల్ వర్సెస్ కమండల’ కూడా కాదు. ఇది ‘హిందుత్వలో సామాజిక న్యాయం’ అంటే మండల్ రాజకీయం కమండల్లో కలిసిపోయింది. నితీష్ కుమార్ రాజకీయ నిష్క్రమణ భారతదేశంలో స్వయంప్రతిపత్తి కలిగిన సామాజిక న్యాయ పార్టీల క్షీణతలో ఒక ముఖ్యమైన మైలురాయి.
అసలు ఏమిటిది?
90వ దశకంలో భారత రాజకీయం రెండు ప్రధాన ధృవాల చుట్టూ తిరిగింది. 1990లో బి.పి. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించడం. దీనికి లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి నేతలు ప్రతినిధులుగా నిలిచారు. ఇది ‘సామాజిక న్యాయం’ నినాదంతో సాగింది. అదే సమయంలో బీజేపీ చేపట్టిన ‘రామజన్మభూమి’ యాత్ర. ఇది హిందూ ఓటర్లను కులాలకు అతీతంగా ఏకం చేయాలనే లక్ష్యంతో సాగింది. ‘కమండలం’ అనేది సాధువుల చిహ్నం కాబట్టి, హిందుత్వ రాజకీయానికి ఇది ఒక సంకేతంగా మారింది.
నితీష్ కుమార్ దెబ్బకు లాలూప్రసాద్ మట్టికరిచిన తర్వాత నితీష్తో పొత్తు పెట్టుకొని బలమైన వారి ఓటుబ్యాంకును బీజేపీ తమవైపు తిప్ప్పుకుంది. ఇప్ప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కూడా బీజేపీ ఉంది. చంద్రబాబు కూడా రాజ్యసభకు వెళ్లి ఉపప్రధాని అవుతారని ఆయనక మద్దతిచ్చే మీడియా నిన్న ఓ కథనం వదిలింది. మోదీ దగ్గర ఉపప్రధాని అనే మోడల్ లేదు. ఇక ఉపరాష్ట్రపతి పదవి అంటారా.. 2030 వరకు ఖాళీ అవదు. అయినా అంత వేగంగా టీడీపీని బీజేపీ తనలో కలుపుకోదు. దానికి ఇంకా సమయం పడుతుంది. నితీష్ లాగే చంద్రబాబు కూడా ఏదో ఒక రోజు కమండలంలో కలవాల్సిందే. అందుకేనేమో ఈమధ్య కాలంలో హిందుత్వం మీద పేటెంట్ బీజేపీకే కాదు.. టీడీపీకి కూడా ఉందని తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని ఇప్పటికీ సాగదీస్తున్నారు. అంతకంటే కీలకం జగన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా ఇసుక, మద్యం కుంభకోణాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
నరేంద్ర మోదీ తనను తాను ఓబీసీ నాయకుడిగా ప్రకటించుకోవడం బీహార్, యూపీ వంటి రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ అయింది. అంటే, ‘మాకు ఓబీసీ ప్రయోజనాల కోసం నితీష్ లేదా లాలూ అవసరం లేదు, మా దగ్గరే ఓబీసీ ప్రధాని ఉన్నారు’ అనే సంకేతాన్ని బీజేపీ పంపింది. మరికొన్నేళ్లలో ప్రాంతీయ పార్టీలున్న మరిన్ని రాష్ట్రాల నుంచి ఇటువంటి మార్పులే వస్తాయి. అందులో సందేహం లేదు.
- సత్యంన్యూస్, శ్రీకాకుళం






Comments