top of page

కలెక్టర్లకు కొత్త టార్గెట్‌లు

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 2 hours ago
  • 2 min read
  • పరిశ్రమలు తెస్తేనే మార్కులు

  • ఈజ్ ఆఫ్ డూయింగ్ మేరకు బదిలీలు

  • పారిశ్రామికవేత్తలతో నిత్యం మీటింగ్‌లు

  • పరుగులు పెడుతున్న జిల్లా బాస్‌లు

(సత్యంన్యూస్,అమరావతి )

ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎసఐపీసీ), రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎసఐపీబీ), ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డులతో పాటు ఇతర పెట్టుబడులను ఆకర్షించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరడంతో ఇప్ప్పుడు పరిశ్రమల స్థాపనకు, తద్వారా ఉపాధికల్పన, సంపద సష్టి కోసం కలెక్టర్లు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే జిల్లాస్థాయిలో కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరించే ‘జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీలు’ ఉన్నాయి.

ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రకారం, జిల్లాలు సాధించిన పెట్టుబడులు, కల్పించిన ఉపాధి, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస’ ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు కేటాయించనున్నారు. దీనివల్ల కలెక్టర్లపై పనిభారం పెరగనుంది. కలెక్టర్లు కేవలం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించడమే కాకుండా, వారిని తమ జిల్లాల్లో పరిశ్రమలను స్థాపించేలా ఒప్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస’లో ఒక బెంచ్‌మార్క్‌ను నెలకొల్పేలా, సత్వరమే అనుమతులు మంజూరు చేయడంపై దృష్టి సారించాల్సి ఉంది.

ముఖ్యమంత్రి ప్రణాళిక మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కలెక్టర్లకు తమ జిల్లాల బలాబలాలు బాగా తెలుసు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు అనువైన నిర్దిష్ట ప్రాంతాలను గుర్తించడంలో, ప్రోత్సహించడంలో వారికి అనుభవం ఉంటుంది. ఉదాహరణకు రాష్ట్రంలో తీర ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమలో భూమి ధరలు తక్కువగా ఉండటం వల్ల అక్కడ ఇప్పటికే పునరుత్పాదక ఇంధన సంస్థలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. అయితే, కలెక్టర్లు భూములను అప్పగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే, కేవలం భూమి సమస్యలే కాకుండా, నీరు, విద్యుత్ సౌకర్యాలు వంటి భూమియేతర సమస్యలను కూడా పరిష్కరించి, భవిష్యత్తులో పెట్టుబడుల అమలులో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి.

కొన్ని జిల్లాలు సహజ వనరులు, ఇతర పారిశ్రామిక కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల సహజసిద్ధమైన ప్రయోజనాలు ఉన్నాయి. విశాఖపట్నం, చెన్నై నగరాలకు దగ్గరగా ఉండటం వల్ల ఉత్తరాన ఉన్న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు, అలాగే దక్షిణాన ఉన్న తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు పెట్టుబడిదారులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలుగా మారాయి. విశేషమేమిటంటే, కొన్ని ప్రధాన ప్రాజెక్టులను ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రారంభించినందుకు గాను అనకాపల్లి, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు జిల్లాల కలెక్టర్లను సదస్సులో అభినందించారు. చాలా పెద్ద పరిశ్రమలు ఇప్పటికీ ఈ ప్రాంతాల వైపే మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి, కొన్ని జిల్లాల కలెక్టర్లకు సహజంగానే అనుకూల పరిస్థితులు ఉన్నాయి, దీనివల్ల ర్యాంకుల పోటీలో సమానమైన అవకాశం లేదని ఇతర కలెక్టర్లు భావించే అవకాశం ఉంది.

పారిశ్రామికవేత్తల మెమోరాండం సమర్పించినప్పటి నుంచి, ఏవైనా సమస్యలు ఉంటే ప్రారంభం నుంచే పరిష్కరించేలా చూడటానికి, ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించే బాధ్యతను మండల ప్రత్యేక అధికారులకు అప్పగించాలని, ప్రధాన ప్రాజెక్టులకు జాయింట్ కలెక్టర్లను, మున్సిపల్ కమిషనర్లను ప్రత్యేక అధికారులుగా నియమించాలని కలెక్టర్లకు మరో సూచన ఇచ్చారు.

పెద్ద పారిశ్రామిక ప్రాజెక్టులను ఆకర్షించలేని ప్రాంతాలలో ఐటీ, ఎంఎసఎంఈ, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా, ముఖ్యంగా పర్యాటక రంగంలో ఐదు ఎకరాల వరకు భూమిని కేటాయించేందుకు కలెక్టర్లకు విచక్షణాధికారాలను కల్పించారు. దీనివల్ల పర్యాటక సౌకర్యాలను ఏర్పాటు చేయాలనుకునే వారిని వెంటనే ఆకర్షించడానికి కలెక్టర్లకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత, ముఖ్యమంత్రి ఒకే నగరంపై ఆధారపడకుండా, తీరప్రాంత, డెల్టా, రాయలసీమ ప్రాంతాల్లో రంగాల వారీగా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ, ప్రాంతీయ ఆధారిత పారిశ్రామికీకరణ వైపు మళ్లారు. వివిధ శాఖల పరిధిలోని చిన్న చిన్న నేరాలను నేరరహితం చేయడం కోసం ‘ఏపీ జన్ విశ్వాస్ (సవరణల) బిల్లు`2026ను ఆమోదించారు. ఇది ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస’ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.

పెట్టుబడులను సమీకరించడంలో తాము ఏ మేరకు విజయం సాధించామో తెలియజేయడానికి జూన్/జూలై నెలల్లో జరగనున్న తదుపరి కలెక్టర్ల సదస్సు వరకు కలెక్టర్లకు సమయం ఉంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, 2024 జూన్ నుంచి 12 శాఖల పరిధిలో దాదాపు 20.35 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ప్రభుత్వం 771 కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఎక్కువ భాగం ఇంధన, పరిశ్రమలు, వాణిజ్య శాఖలకు సంబంధించినవే.

ఈ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రతిపాదనలన్నింటినీ వీలైనంత త్వరగా వాస్తవ రూపంలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆతృతగా ఉంది. ఈ నేపథ్యంలోనే, కలెక్టర్లు కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి పోటీ పడాలని ఆశిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరిగే ఇటువంటి ప్రయత్నాలే రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page