గ్లోబల్ సంక్షోభాన్ని భారత్ జయించగలదా?!
- Prasad Satyam
- 1 hour ago
- 3 min read

అమెరికా తమ వ్యవస్థలను నాశనం చేస్తే.. ప్రతిగా తాము అమెరికన్ ఐటీ కంపెనీలు, ఇతర కార్పొరేషన్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ చేసిన హెచ్చరిక సరికొత్త భౌగోళిక రాజకీయ సంఘర్షణకు తెరతీస్తున్నది. గతంలో యుద్ధాలు, ఉద్రిక్తతలు ప్రభుత్వ శక్తులు, సైనిక స్థావరాలల చుట్టూనే కేంద్రీకృతమై ఉండేవి. పశ్చిమాసియా యుద్ధం ఆ హద్దులను చెరిపివేసి శత్రువు ఆర్థిక, మౌలిక వసతుల మూలాలను దెబ్బతీసేదిగా మారితోంది. ఇదొక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. ఎందుకంటే ఈ సంస్థలు వాణిజ్య కేంద్రాలు మాత్రమే కాదు.. అవి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ సమాచార మార్పిడికి చోదకశక్తిగా నిలుస్తున్నాయి. అమెరికాకు ఇరాన్ చేసిన హెచ్చరిక ఆధునిక యుద్ధం ఇకపై క్షిపణులు, సైనికులకు మాత్రమే పరిమితం కాకుండా డేటా, అల్గారిథమ్లు, డిజిటల్ ఇంటెలిజెన్స్లకు విస్తరిస్తుందని స్పష్టం చేస్తున్నది. ఇది పూర్తిగా వాస్తవమైనా కాకపోయినా ప్రపంచ టెక్ సంస్థల రిస్క్ ప్రొఫైల్ను మారుస్తుంది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న టెక్ కార్యాలయాలు, డేటా సెంటర్లు సంభావ్య ఒత్తిడి కేంద్రాలుగా మారతాయి. ఈ భయాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, విస్తరణ ప్రణాళికలను ఆలస్యం చేయడానికి, మూసివేతలకు ప్రేరేపిస్తాయి.
ఈ కంపెనీలకు కలిగే ఏ అంతరాయానికైనా పరిణామాలు పశ్చిమ ఆసియా తక్షణ భౌగోళిక పరిధిని దాటి చాలా దూరం విస్తరిస్తాయి. ఆధునిక డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరస్పర ఆధారితమైనది. ఇందులో క్లౌడ్ సేవలు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, విమానయానం, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్ మరియు పాలనా వ్యవస్థలకు అదృశ్య మౌలిక సదుపాయాలుగా పనిచేస్తాయి. భౌతిక ముప్పులు, సైబర్ ప్రతీకార చర్యలు లేదా తాత్కాలిక మూసివేతల ద్వారా కార్యకలాపాల్లో కలిగే అంతరాయం అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే భౌగోళిక రాజకీయ ప్రకంపనలకు సున్నితంగా ఉండే ఆర్థిక మార్కెట్లు, తీవ్రంగా ప్రతిస్పందించే అవకాశం ఉంది. డిజిటల్ సమన్వయంపై ఆధారపడిన సరఫరా గొలుసులు ఆలస్యాన్ని ఎదుర్కోవచ్చు. ప్రధాన వ్యవస్థలపై ఒత్తిడి పెరిగితే, చెల్లింపులు, ఇ-కామర్స్ లావాదేవీలు మరియు డేటా నిల్వ వంటి సాధారణ సేవలు కూడా అస్థిరతను ఎదుర్కోవచ్చు. అందువల్ల ఈ ప్రమాదం కేవలం భౌతిక నష్టానికే పరిమితం కాదు, వ్యవస్థాగత అంతరాయాన్ని కూడా కలిగి ఉంటుంది, ఇక్కడ కేవలం అనిశ్చితి మాత్రమే ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలను మందగింపజేయడానికి సరిపోతుంది.
యుద్ధ ప్రభావం భారతదేశంపై పరోక్షంగా ఉన్నప్పటికీ చాలా తీవ్రమైనవి. మన దేశ సమాచార, సాంకేతిక, పారిశ్రామిక రంగాలు టెక్నాలజీతోనే ముడిపడి ఉన్నాయి. వాటి కార్యకలాపాల్లో అంతరాయాలు ముఖ్యంగా కార్పొరేట్ కార్యకలాపాలకు ఆతిథ్యం ఇచ్చే గల్ఫ్ వంటి ప్రాంతాల్లో ప్రాజెక్టుల ఆలస్యం, ఒప్పందాల పునఃసమీకరణ, అవుట్ సోర్సింగ్ డిమాండ్లో మందగమనానికి దారి తీయవచ్చు. స్టార్టప్ల నుంచి పెద్ద సంస్థల వరకు భారతదేశ డిజిటల్ మౌలిక వసతుల్లో కీలకమైన క్లౌడ్ సేవలపై ఆధారపడి ఉంది. దీని ప్రభావం బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు, ఆన్లైన్ వ్యాపారాలపై పడవచ్చు. వీటితోపాటు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలపై తక్షణ ప్రభావం పడుతుంది. సుదీర్ఘకాలం పాటు కొనసాగే అనిశ్చితి, నియామకాల్లో వేచి చూసే ధోరణి, విస్తరణ ప్రణాళికల్లో జాప్యం, ఖర్చులు తగ్గించుకోవడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు. ఇప్పటికే ఈ రంగం ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సవాళ్లను ఎదుర్కొంటున్నది. భౌగోళిక రాజకీయ సంక్షోభం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తుంది. అసలు ప్రశ్న ఏమిటంటే.. భారతదేశం ఈ సంక్షోభ పరిస్థితులను ఆసరా చేసుకుని తన సొంత సామర్థ్యాలను బలోపేతం చేసుకోగలదా, బాహ్య వేదికలపై ఆధారపడటాన్ని తగ్గించుకోగలదా?
రూపాయి పతనం, దాని ప్రభావం
కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు ముందస్తు హెచ్చరికలుగా పనిచేస్తాయి. యుద్ధం వల్ల చమురు ధరల పెరుగుదల, అమెరికన్ డాలర్ రేటు పెరుగుదల వంటి ప్రపంచ అస్థిరతల కారణంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. మార్చి 30న అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి 95.22 వద్ద చారిత్రాత్మక కనిష్ట స్థాయిని తాకింది. కరెన్సీ విలువ తగ్గినప్పుడు దిగుమతి చేసుకున్న వస్తువుల దేశీయ ధర పెరుగుతుంది. ఇంధనం, పారిశ్రామిక ముడిసరుకులో గణనీయ భాగం దిగుమతులే కావడంతో ఆ ప్రభావం ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. పెరిగిన ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలు, తయారీ, రవాణా రంగాలపైనా ప్రభావం చూపి అంతిమంగా గృహ జీవన వ్యయ సూచికలను పైకి ఎగబాకేలా చేస్తాయి. సిద్ధాంతపరంగా రూపాయి విలువ తగ్గడం వల్ల భారతీయ ఎగుమతులకు ప్రపంచ మార్కెట్లలో పోటీతత్వం పెరగవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో రూపాయి రికార్డు స్థాయిలో 9.88 శాతం క్షీణించింది. ఇది గత 14 ఏళ్లలో అత్యంత తీవ్రమైన పతనం. దీని దిశ ప్రధానంగా చమురు ధరల పోకడలు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. భారతదేశ ముడి చమురు అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు గణనీయంగా పెరిగినప్పుడు దిగుమతుల బిల్లు పెరుగుతుంది. దానికోసం మరిన్ని అదనపు డాలర్లు అవసరమవుతాయి. అయితే ఇప్పటికే అమెరికన్ డాలర్ ఒత్తిడితో భారతీయ రూపాయి బలహీనపడుతున్నది. ఫలితంగా మరింత భారం పడుతుంది. అస్థిర సమయాల్లో ప్రపంచ పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తారు. యూఎస్ డాలర్ను ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా పరిగణిస్తారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం పెరిగే కొద్దీ డాలర్లోకి డబ్బు ప్రవహించడం దానిని మరింత బలోపేతం చేస్తుంది. గత ఏడాది డిసెంబర్ 3న డాలర్తో రూపాయి మారకం రేటు 90 మార్కును దాటింది. నిరంతరాయంగా ఈక్విటీల నుంచి నిధులు తరలిపోవడం, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి దీనికి కారణమని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న ఆర్బీఐ తీసుకున్న చర్చల కారణంగా చాలా ఏళ్ల తర్వాత ఒకేరోజు అత్యంత భారీ లాభం నమోదు చేసింది.156 పైసలు పెరిగి 93.14 (తాత్కాలిక) వద్ద స్థిరపడింది. హెడ్జ్ డాట్ ఇన్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్-హెచఎనఐ డెరివేటివ్స్ రియాంక్ అరోరా మాట్లాడుతూ ఇటీవలి కాలంలో రూపాయి విలువ పడిపోవడానికి ప్రధానంగా బాహ్య పరిణామాలే కారణమని అన్నారు. ‘ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం రెండు విధాలుగా ఉంటుంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతుల, ముఖ్యంగా ఇంధనం ధరలు పెరుగుతాయి. ఇది రవాణా, ఉత్పత్తి ఖర్చుల ద్వారా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దీనివల్ల వినియోగదారుల వ్యయం, కార్పొరేట్ లాభదాయకత తగ్గవచ్చు. అదనంగా పెరుగుతున్న చమురు ధరలు కరెంట్ అకౌంట్ లోటును మరింత పెంచుతాయి’ అని ఆయన అన్నారు. గత సంఘటనలతో పోలిస్తే భారతదేశం సాపేక్షంగా బలమైన స్థితిలో ఉందని ఆయన వివరించారు. ఆర్థిక అస్థిరతను ఎదుర్కోవడానికి ఆర్బీఐ వద్ద తగినంత విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. అదే సమయంలో ఇంధన పన్నులను సర్దుబాటు చేయడానికి లేదా ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి లక్షిత చర్యలను అమలు చేయడానికి ప్రభుత్వానికి విధానపరమైన వెసులుబాటు ఉంది. మున్ముందు రూపాయి గమనం ప్రధానంగా చమురు ధరల పోకడలు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని అరోరా పేర్కొన్నారు.
- నౌపడ సత్యనారాయణ






Comments