top of page

చుక్కలు చూపిస్తున్న చిట్టెలుక!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 16, 2025
  • 3 min read
  • నాలుగు దశాబ్దాల క్రితం ఇరాక్‌పై దాడులు

  • ఇప్పుడు ఇరాన్‌పైనా అదే యుద్ధతంత్రం

  • తనకంటే పెద్ద దేశాలనే ముప్పుతిప్పలు పెడుతున్న ఇజ్రాయెల్‌

  • అణు స్థావరాల ధ్వంసమే ప్రధాన లక్ష్యమని ప్రకటన

విస్తీర్ణం పరంగా ఇజ్రాయెల్‌ చాలా చిన్న దేశం. యూదులు మెజారిటీ జనాభాగా ఉన్న ఈ దేశం చుట్టూ ఉన్నవన్నీ అరబ్‌ దేశాలే. అన్నింటితోనూ ఇజ్రాయెల్‌కు దశాబ్దాలుగా శత్రుత్వమే. ఇప్పటికే పాలస్తీనాలో భాగమైన గాజాపై ఇజ్రాయెల్‌ నాలుగైదు నెలలుగా సైనిక దాడులతో మారణహోమం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అటు లెబనాన్‌, సిరియా, యెమెన్‌ దేశాలతోనూ, ఒకప్పుడు ఇరాక్‌తోనూ ఇజ్రాయెల్‌కు సైనిక ఘర్షణలు కొత్త కాదు. మిగతా దేశాల మాటెలా ఉన్నా తన కంటే ఎన్నో రెట్లు పెద్ద దేశాలైన ఇరాన్‌, ఇరాక్‌లతో కయ్యానికి కాలుదువ్వడమే కాకుండా.. ఇరాక్‌కు నాలుగు దశాబ్దాల క్రితం, ఇరాన్‌ తాజా సైనిక చర్యతో ఇజ్రాయెల్‌ చుక్కలు చూపిస్తోంది.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ప్రస్తుతం ప్రపంచవ్యాప్త చర్చనీయాంశం ఇరాన్‌`ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధమే. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ కకావికలమవుతుండటం, తొమ్మిది మంది వరకు సైనిక జనరళ్లను, కీలకమైన అణు కేంద్రాలను, ఎయిర్‌పోర్టును కోల్పోవడం విస్మయం కలిగిస్తోంది. విస్తీర్ణపరంగా చూస్తే పశ్చిమాసియాలోనే ఇరాన్‌ పెద్ద దేశం. పైగా అణ్వస్త్ర సంపత్తి కలిగి ఉంది. అదే ఇజ్రాయెల్‌ అయితే కేవలం ఒక్క రోజులో మొత్తం చుట్టి రాగలిగేంత చిన్న దేశం. కానీ ఇజ్రాయెల్‌ అమెరికా పెద్ద దన్ను. అన్నింటికీ మించి ప్రపంచంలో అత్యంత కఠినమైనదిగా పేరొందిన మొస్సాద్‌ గూఢచార సంస్థ దానికి వెయ్యేనుగుల బలం ఇస్తోంది. వీటి సాయంతోనే ఇజ్రాయెల్‌ తన చుట్టూ మోహరించినట్లు ఉండే అరబ్‌, ఇస్లామిక్‌ దేశాలను గడగడలాడిస్తోంది. అదే క్రమంలో సుమారు ఏడాది కాలంగా ఇరాన్‌ను దెబ్బకొడుతోంది. ఐదు రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‌ అత్యున్నత దళమైన ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్‌ (ఐఆర్‌జీసీ) అధినేత మేజర్‌ జనరల్‌ హుస్సేన్‌ సలామీతో సహా తొమ్మిదిమంది అత్యున్నత సైనికాధికారులను మట్టుబెట్టింది. ఐఆర్‌జీసీ సామాన్యమైనది కాదు. ఇది నేరు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీకి మాత్రమే జవాబుదారీ. అంతటి పవర్‌ఫుల్‌ దళాన్ని ఇజ్రాయెల్‌ ఏడాదిన్నరగా టార్గెట్‌ చేస్తోంది. సిరియాలోనూ గత ఏడాది ఐఆర్‌జీసీ కమాండర్లను హతమార్చింది. ఇప్పుడు ఏకంగా ఐఆర్‌జీసీ చీఫ్‌నే.. అదీ ఆయన స్వదేశంలోనే అంతం చేసింది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసిన నాటి నుంచి ఇరాన్‌`ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హమాస్‌ కు ఇరాన్‌ మద్దతు ఉందనేది ఇజ్రాయెల్‌ ఆరోపణ. గత ఏడాది ఇరుదేశాలు దాదాపు యుద్ధం వరకు వెళ్లాయి. ఆ నేపథ్యంలో రెండు వేల కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న ఇజ్రాయెల్‌పె ఇరాన్‌ జరిపిన క్షిపణుల దాడిని ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ అడ్డుకుంది.

  • అణు ముప్పును తగ్గించుకునే నెపం

ఇరాన్‌ను తన అస్తిత్వానికి ముప్పుగా ఇజ్రాయిల్‌ భావిస్తోంది. ఇరాన్‌ చేతికి అణ్వాయుధాలు అందకూడదనేది దాని లక్ష్యం. అందుకే 2005 నుంచి ఇరాన్‌ అణు కార్యక్రమాలను నిశితంగా గమనిస్తోంది. ప్రస్తుతం ఇరాన్‌ అణ్వాస్త్రాలకు అవసరమయ్యే యూరేనియాన్ని శుద్ధి చేసినట్లు అనుమానిస్తున్న ఇజ్రాయెల్‌ సమయం కోసం ఎదురు చూసింది. అమెరికాతో ఇరాన్‌ అణు చర్చలు విఫలమై తక్షణమే దానిపై విరుచుకుపడిరది. ముఖ్యంగా ఇరాన్‌ అణు కార్యక్రమాలు, వారి సైంటిస్టులను టార్గెట్‌ చేసి దాడులు చేసింది. ఐఆర్‌జీసీ సుశిక్షితమైనదే కాదు.. దీనికి మూడు దళాలు ఉంటాయి. ఇక ఇజ్రాయెల్‌ కంటే ఇరాన్‌ దాదాపు 70 రెట్లు పెద్దది. జనాభాపరంగానూ ఇజ్రాయెల్‌ కంటే ఇరాన్‌ జనాభా 10 రెట్లు ఎక్కువే. కానీ యుద్ధంలో ఏడాదిన్నరగా ఇరాన్‌ మాత్రమే ఎక్కువ నష్టపోతోంది. తొమ్మిదిమంది అణు శాస్త్రవేత్తలు ఇజ్రాయెల్‌ దాడిలో చనిపోయారు. గత ఏడాది మేలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇక సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీవి కూడా పైపై హెచ్చరికలే తప్ప వాస్తవంలో చేసేది ఏమీ కనిపించడం లేదు. ఇదంతా చూస్తుంటే.. అతి చిన్నదైన ఇజ్రాయెల్‌ ముందు పెద్ద దేశమైన ఇరాన్‌ తలొంచినట్లు కనిపిస్తోంది.

  • అప్పట్లో ఇరాక్‌పైనా ఇదే తరహా దాడులు

ఇరాక్‌పై కూడా 1981లో ఇజ్రాయెల్‌ ఇలాగే దాడులు చేసింది. 1981లో 14 ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు సినాయ్‌ ద్వీపకల్పంలోని ఎట్జియన్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి వెళ్లి ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌పై దాడులు చేశాయి. బాగ్దాద్‌కు సమీపంలో ఉన్న ఒసిరాక్‌ అణు కేంద్రంపైనా ఇజ్రాయిల్‌ ఫైటర్‌ జెట్లు విరుచుకుపడ్డాయి. ఏకంగా 1100 కి.మీ దూరం నుంచి ఇజ్రాయెల్‌ సైన్యం ఈ దాడి చేసింది. ‘ఆపరేషన్‌ ఒపేరా’ అనే కోడ్‌నేమ్‌తో నిర్వహించిన ఈ దాడి అప్పట్లో పెద్ద సంచలనం. ఇరాక్‌ అణు కార్యక్రమం 1950 చివర్లో ప్రారంభమైంది. అయితే 1970లో సద్దాం హుస్సేన్‌ హయాంలో ఈ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 1976లో ఇరాక్‌ ఫ్రాన్స్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఇరాక్‌కు 70 మెగావాట్ల పరిశోధన రియాక్టర్‌ను సరఫరా చేసేందుకు అంగీకరించింది. రియాక్టర్‌ డిజైన్‌ పేరు ఒసిరాక్‌. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కింద ఉన్న రియాక్టర్లను అధికారికంగా శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించా. అయితే ఒకసారి రియాక్టర్‌ ప్రారంభమైన తర్వాత దాన్ని ఆయుధ గ్రేడ్‌ ఫ్లూటోనియం ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగించవచ్చని, అది తనకు ముప్పు అని ఇజ్రాయిల్‌ పసిగట్టింది. దాంతో అప్పటి ఇజ్రాయిల్‌ సైనిక దళాల చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాఫెల్‌ ఈటన్‌ ఆధ్వర్యంలో ప్లాన్‌ ప్రారంభమైంది. 1980లో ఎనిమిది ఎఫ్‌ 16 ఫైటర్లను దాడి చేసేందుకు, వాటికి రక్షణ కవచంగా ఆరు ఎప్‌ 15 ఏ ఫైటర్‌ జెట్లను ఏర్పాటు చేసింది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా వెళ్లి ఇరాక్‌ రియాక్టర్లను నేలమట్టం చేయాలని ప్లాన్‌ చేసింది. ఆ మేరకు కేవలం వంద అడుగుల ఎత్తులోనే.. జోర్డాన్‌ మీదుగా ఆగ్నేయ దిశగా సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించి, అక్కడ నుంచి బాగ్దాద్‌ వైపు ఫైటర్‌ జెట్లు వెళ్లేలా ప్రణాళిక రచించారు. దీనివల్ల ఇరాకీ రాడార్ల నుంచి ఇజ్రాయెల్‌ విమానాలు తప్పించుకున్నప్పటికీ జోర్డాన్‌ రాజు హుస్సేన్‌ వాటిని గుర్తించి ఇరాక్‌కు అందించడానికి తమ దేశ యంత్రాంగం ద్వారా ప్రయత్నించారు. కానీ కమ్యూనికేషన్‌ వైఫల్యం వల్ల ఈ సమచారం బాగ్దాద్‌కు చేరలేదు. ఫలితంగా ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు నిరాటంకంగా ఇరాక్‌ గగనతలంలోకి ప్రవేశించి కేవలం రెండు నిమిషాల్లోనే ఇరాక్‌ అణు రియాక్టర్లపై బాంబులు వేసి నాశనం చేసి తిరిగి ఇజ్రాయెల్‌కు చేరుకున్నాయి. ఐక్యరాజ్యసమితి, అమెరికా, ఫ్రాన్స్‌ ఇజ్రాయెల్‌ చర్యను ఖండిరచినా ఏమాత్రం వెరవని అప్పటి ఆ దేశ ప్రధాని మెనాచెమ్‌ బిగిన్‌ మాట్లాడుతూ.. ఏ అరబ్‌ దేశాన్ని కూడా అణ్వాయుధాలు తయారు చేయనీయబోమని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఇదే సిద్ధాంతాన్ని ఇరాన్‌ విషయంలో ఇజ్రాయిల్‌ వర్తింపచేస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page