చట్టం కొందరికే చుట్టం!
- DV RAMANA

- Aug 7, 2025
- 2 min read

చట్టం ముందు అందరూ సమానమేనంటారు. ధనిక, పేద, కులం, మతం, బంధుత్వం వంటివేవీ చూడకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందంటారు. కానీ వాస్తవాలను గమనిస్తే.. కొంద రిని మాత్రం ఎక్కువ సమానులుగా పరిగణిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. కావాలంటే వివాదాస్పద డేరాబాబా ఉదంతాన్నే చూడండి.. తన శిష్యురాళ్లిద్దరిపై అత్యాచారం చేయడం, హత్య వంటి తీవ్ర అభియోగాలు రుజువు కావడంతో హర్యానా రాష్ట్రం రోప్ాతక్లోని డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మిత్ రామ్రహీమ్ సింగ్ అలియాస్ డేరాబాబాకు 2017లోనే కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అప్పట ినుంచీ ఆయన ఒకటి రెండుసార్లు కాదు.. ఏకంగా 14సార్లు పెరోల్పై బయటకొచ్చారు. తాజాగా ఆయనకు మరోసారి 40 రోజుల పెరోల్ మంజూరైంది. దాంతో ఆయన అత్తారింటికి వచ్చీపోయి నట్లు రాకపోకలు సాగిస్తున్నారు. దర్జా అనుభవిస్తున్నారు. మరోవైపు చూస్తే 90 శాతం అంగవైకల్యం కలిగిన ఢల్లీి యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను నక్సల్స్ నిరోధక చట్టం ప్రయోగించారు. ఆయన దోషిత్వం నిరూపితం కాకపోవడంతో విచారణ ఖైదీ(అండర్ ట్రయల్)గా పరిగణించకుండా కరెంటు కూడా లేని అండా (కోడిగుడ్డు ఆకారంలో ఉండే సెల్) జైల్లో నిర్బంధించి, కనీసం బెయిల్ కూడా దొరక్కుండా చేసి పరోక్షంగా ఆయన మరణానికి కారణమయ్యారు. చట్టం ముందు అందరూ సమా నం కాదని.. కొందరు ఎక్కువ సమానం.. ఇంకొందరు అతి తక్కువ సమానం అన్నది.. ఈ రెండు ఉదంతాలతోనే తేటతెల్లమైపోతోంది. దీన్నే ఇంకోలా చూస్తే.. తీవ్రమైన నేరాల్లో శిక్ష పడిన డేరాబాబా లాంటివారు తమకు కావలసినప్పుడల్లా పెరోల్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తూ రాజభోగాలు అను భవిస్తుంటే.. ఎటువంటి పలుకుబడి, ధనబలం లేని లక్షలాది అండర్ ట్రయల్ నిందితులు నెలలు, ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గిపోతున్నారు. శిక్ష పడిన 2017 నుంచి నేటి వరకు ఎనిమిదేళ్లలోనే డేరా బాబా సుమారు 40 సార్లు పెరోల్పై బయటకొచ్చారు. ఇలా వచ్చిన ప్రతిసారీ కనీసం 20 రోజుల వరకు బయట ఉంటున్నారు. అంటే ఆయన విషయంలో పెరోల్ నిబంధన ఎంతగా దుర్వినియోగ మైందో అర్థం చేసుకోవచ్చు. దీనికి విరుద్ధంగా విచారణ ఎదుర్కొంటూ రిమాండ్లో ఉన్న నిందితు లకు బెయిల్ మంజూరుచేసే విషయంలో మాత్రం ట్రయల్ కోర్టులు సాచివేత ధోరణి అవలంభిస్తు న్నాయి. ఇది తెలియనివారు చేసిన ఆరోపణ కాదు. సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టే ఈ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. కేసుల్లో నిందితులకు బెయిల్ ఇచ్చే విషయంలో ట్రయల్ కోర్టులు తమ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాయని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా రాజకీయ సంబం ధిత కేసుల్లో ఎవరికి వారు ఎవరికివారు మనకెందుకులే అన్నట్లు తప్పుకొనే ధోరణిలో వ్యవహరిం చడం వల్ల నిందితులు అకారణంగా జైళ్లలోనే మగ్గిపోవాల్సి వస్తోంది. డబ్బు, పలుకుబడి ఉన్న వారు మాత్రం ఎంత పెద్ద కేసుల్లో ఉన్నా.. బడా లాయర్లను పెట్టుకుని ఏ సమయంలోనైనా కోర్టుల తలుపు తట్టి బెయిల్ తెచ్చుకోగలుగుతున్నారు. ఇవేవీ లేని సామాన్యులపై కేసులు నమోదైతే మాత్రం లాయర్ల ను పెట్టి వాదించుకునే స్తోమత లేకపోవడం, అలాగే ఇటువంటి వారికి ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందించాలన్న నిబంధన ఎక్కడా అమలు కాకపోవడం వల్ల తప్పు చేయకపోయినా.. చాలామంది నిందితులు కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో మగ్గిపోతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వద్ద ఉన్న గణాంకాలు కూడా దీన్నే నిర్థారిస్తున్నాయి. 2018 నుంచి 2022 నాటికి దేశవ్యాప్తంగా విచారణకు ఎదురుచూస్తున్న అండర్ ట్రయల్స్ సంఖ్య 1.40 లక్షల మేరకు పెరిగి 4,34,302 నుంచి 5,73,220కు చేరింది. జైళ్లలో ఉన్న ఖైదీల్లో వీరే 75.8 శాతం మేరకు ఉన్నారని తేలింది. వీరిలో ఐదేళ్లకుపైగా విచారణ ఎదుర్కొంటున్న వారి సంఖ్య సుమారు 11వేలు. ఇక ఏడాదికి మించి విచారణ పేరుతో జైళ్లలో ఉంటున్నవారి సంఖ్య లక్షల్లోనే ఉంది. అండర్ ట్రయల్ ఖైదీలతో జైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. దేశంలోని జైళ్లు 4,36,266 మందిని ఉంచే సామర్థ్యం కలిగి ఉండగా ప్రస్తుతం 5,73,220 (131 శాతం) మందిని అవే సెల్స్లో కుక్కేశారు. ఒకవైపు బుల్డోజర్లు పెట్టి ఎలాంటి విచారణ లేకుండానే క్రిమినల్స్ అన్న ముద్ర వేసేసి శిక్షలు విధించేస్తున్న నియంతృత్వ ధోరణి.. మరో వైపు తమ భావజాలానికి, తమ రాజకీయ పెత్తనానికి అవరోధంగా ఉన్న వారిని ఏదో సాకుతో జైళ్ల లోకి నెట్టేసే అనధికార ఎమర్జెన్సీ పోకడలు దేశ ప్రజాస్వామిక పునాదులకు గొడ్డలిపెట్టులాంటివే.










Comments