బీహార్లో ఓట్ల తొండాట!
- DV RAMANA

- 7 days ago
- 3 min read
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు
కానీ ఫలితాల్లో లెక్కించిన ఓట్లు 7.45 కోట్లు
పోలైన ఓట్లే 67 శాతం.. అవే అసలు కంటే ఎక్కువ
ఈ తప్పులు ఫలితాలనే తారుమారు చేశాయన్న ఆరోపణలు
ఓట్ల చోరీ విమర్శలకు బలం చేకూరుస్తున్న ఈసీ తీరు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన బీహార్లో విజేతలెవరో తేలిపోయింది. ఎలక్షన్ కమిషన్, ఈవీఎంల సాక్షిగా అధికార ఎన్డీయే కూటమి దాదాపు ఎనిమిది దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాసేలా ఎన్డీయే కూటమి 202 స్థానాలు చేజిక్కించుకుంది. ఇరవయ్యేళ్ల నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీకే మరో ఐదేళ్లు పాలించే అధికారం లభించడం నిజంగా పెద్ద విశేషమే. కానీ ఈ విశేషం వెనుక ఒక పెద్ద వివాదం కూడా ఉంది. అదే ఈ ఎన్నికల ఫలితాలపై అపనమ్మకాల నీలినీడలు కమ్మేలా చేస్తోంది. ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుంచీ కలకలం రేపుతున్న ఓటు చోరీ అంశం. ఎన్డీయే కూటమి అధికారికంగా ఓటు చోరీకి తెగబడటం వల్లే ఇంత భారీ విజయం సాధించగలిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. ‘ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్గా జ్ఞానేంద్రకుమార్ ఉన్నన్నాళ్లూ ప్రతిపక్షాలకు విజయం ఎండమావే’ అని ఒకప్పటి బీజేపీ నేత, గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రిగా పని చేసిన సీనియర్ నాయకుడు ప్రొఫెసర్ యశ్వంత్ సిన్హాయే వ్యాఖ్యానించారు. ఫలితాల అనంతరం కాంగ్రెస్ సైతం ఇదే తరహా ఆరోపణలు చేసింది. బీహార్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు ఉంటే ఈవీఎంలలో దానికంటే అధికంగా 7.45 కోట్ల ఓట్లు లెక్కించడం ఏమిటని కాంగ్రెస్ సహా ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే ఇవేవో ఆయా పార్టీలు సంఘాల సొంత లెక్కలు కాదు. సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన అంకెలు కావడం, వాటిలోని డొల్లతనం బయటపడటంతో మొత్తం ఎన్నికల ప్రక్రియనే అనుమానించాల్సి వస్తోంది.
ఎన్నికల సంఘం లెక్కల్లో లోపాలు
బీహార్ ఎన్నికలకు ముందు ఈ ఏడాది సెప్టెంబర్ 30న, రెండు దశల పోలింగ్ పూర్తి అయిన తర్వాత నవంబర్ 11న విడుదల చేసిన ప్రెస్నోట్లలోనే రాష్ట్రంలో ఉన్న ఓటర్ల సంఖ్యకి మించి ఓట్లు పోలైన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అధికార కూటమికి అనుకూలంగా ఎన్నికల సంఘమే ఈవీఎంల ద్వారా ఓట్ల చోరీకి పాల్పడిరదని ఆరోపణలను ఈ వ్యత్యాసం బలపరుస్తోంది. సెప్టెంబర్ 30న ఈసీ జారీ చేసిన ప్రెస్నోట్లోని వివరాల ప్రకారం ఈ ఏడాది జూన్ 24 నాటికి బీహార్లో 7.89 కోట్ల మంది ఓటర్లు ఉండేవారు. ఎన్నికల జాబితాల ప్రత్యేక రివిజన్(ఎస్ఐఆర్) ద్వారా 65 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. అనంతరం ఆగస్టు ఒకటో తేదీన 7.21 మంది ఓటర్లు ఉన్నట్లుగా ముసాయిదా జాబితా ప్రకటించారు. దానిపై అభ్యంతరాలు, చేర్పులు చేపట్టారు. అభ్యంతరాల కారణంగా 3.66 ఓట్లు తొలగించి, అదే సమయంలో ఫారం`6 ద్వారా కొత్తగా చేరిన 21.53 లక్షల ఓటర్లను చేర్చారు. ఆ మేరకు తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. దాని ప్రకారం రాష్ట్రంలో 7.42 కోట్ల ఓటర్లు ఉన్నారని, వారే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారని ఎన్నికల సంఘం స్వయంగా పేర్కొంది.
కానీ జరిగిందేమిటంటే..
ఈ నెల 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరిగిన పోలింగులో నమోదైన ఓట్ల వివరాలను ఈ నెల 11న ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలివిడత పోలింగులో మహిళా, పురుష ఓటర్లు కలిపి మొత్తం 3,75,13,302 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ మేరకు తొలిదశలో 65.08 శాతం పోలింగ్ జరిగినట్లు చూపించారు. ఇక రెండో విడతలో 68.76 శాతం పోలింగ్ నమోదు కాగా మహిళలు, పురుషులు కలిపి 3,70,13,556 ఓట్లు పోలయ్యాయి. ఆవిధంగా మొత్తం రెండు విడతల్లో కలిపి 66.91 శాతం పోలింగ్ జరగ్గా 7,45,26,858 ఓట్లు వేసినట్లు ఎన్నికల సంఘం తన ప్రెస్నోట్లో స్పష్టంగా పేర్కొంది.
ఇదెలా సాధ్యం?
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు అని సెప్టెంబర్ 30నాటి ప్రెస్నోట్లో వెల్లడిరచిన ఎన్నికల సంఘమే ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా 7.45 కోట్లకుపైగా ఓట్లు పోలయ్యాయని పేర్కొనడంనై విస్మయం వ్యక్తమవుతోంది. ఉన్న ఓట్లే 7.42 కోట్లు అయితే వాటి కంటే అధికంగా 7.45 కోట్ల పైచిలుకు ఓట్లు ఎలా పోలయ్యాయన్నది ప్రశ్నార్థకం. మరో కోణంలో చూస్తే రాష్ట్రంలో రెండు దశల్లో జరిగిన పోలింగ్లో 66.91 శాతం పోలింగే నమోదైంది. దాన్నే అంకెల్లో 7,45,26,858 ఓట్లుగా చూపించారు. 67 శాతానికే ఉన్న ఓట్లకు మించి 7.45 కోట్లు పోలైతే.. ఇక వంద శాతం పోలింగ్ జరిగితే 11.12 కోట్ల పైచిలుకు ఓట్లు అన్నమాట. కానీ రాష్ట్రంలో ఉన్న ఓటర్ల సంఖ్య 7.42 కోట్లేనని ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. వాస్తవ ఓటర్ల సంఖ్య 7.42 కోట్లలో 66.91 శాతం పోలైనట్లు లెక్క వేస్తే మొత్తం ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల సంఖ్య 4.97 కోట్లే ఉండాలి. కానీ ఆ సంఖ్య 7.45 కోట్లుగా చూపించడం గమనార్హం. ఈ అంకెల్లో ఏది వాస్తవం అన్నది తేల్చాల్సిన బాధ్యత, తప్పుడు ఎక్కడ జరిగింది. ఫలితాలపై దాని ప్రభావానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నది తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ అంకెలనే ప్రస్తావిస్తూ ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ నాయకత్వం బీహార్లో ఓట్ల చోరీకి పాల్పడిరదని ధ్వజమెత్తింది. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడిరచిన గణాంకాలు వాస్తవమైతే.. ఈవీఎంల ద్వారా ఓట్లు గోల్మాల్ అయ్యాయని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని భావించాల్సి వస్తుందని పేర్కొంది. బీహార్లో జరిగిన ఓటు చోరీపై ఏన్డీయేతర రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి, ప్రత్యక్ష ఆందోళనలకు దిగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈసీ ఓట్ల లెక్కల్లో తప్పులు నిజమే అయితే దాని వల్ల మొత్తం ప్రజాతీర్పునే తప్పుగా మార్చేసినట్లే. ప్రజల తీర్పునకు విరుద్ధంగా వేరే పక్షానికి అధికారం కట్టబెట్టినట్లే భావించాల్సి వస్తుంది. ఈ తప్పుడు విధానాలను కొనసాగనిస్తే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎన్నికలను ఇదే కుసంస్కృతి కమ్మేసి ప్రజాతీర్పును మార్చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.










Comments