మేడిపండు చందం.. మన ఆర్థికం!
- DV RAMANA
- 3 days ago
- 2 min read

ఆర్థిక రంగంలో భారత్ శరవేగంగా దూసుకుపోతోందని.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు ఐఎంఎఫ్ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇంత వరకు ఐదో స్థానంలో ఉన్న భారత్ నాలుగో స్థానంలో ఉన్న జపాన్ను అధిగమించి ఆ స్థానాన్ని ఆక్రమించడం ద్వారా ఒక మెట్టు పైకి ఎక్కినట్టు వార్తలు వచ్చాయి. దీన్ని తమ ప్రభుత్వ ఘనతగా మోదీ సర్కారు ప్రచారం చేసుకుంటోంది. అయితే స్థానాలు, గణాంకాలు మారుతున్నా దేశంలోని ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి సానుకూల మార్పులూ కనిపించటం లేదని ఆర్థిక నిపుణులు, మేధావులు ఎత్తిచూపుతున్నారు. దేశ సంపదంతా ఒక్క శాతం మేరకే ఉన్న అత్యంత సంపన్నవర్గం చేతిలో చిక్కుకుపోవడమే దీనికి కారణమంటున్నారు. ఫలితంగా దేశ ప్రజల తలసరి ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయంటు న్నారు. మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ మేడిపండు చందంగా తయారైంది. ఈ సర్కారు అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ ఆశించినంతగా వృద్ధి సాధించలేదు. సర్కారు అనుసరిస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాలే కారణమని విశ్లేషిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటంలో కేంద్రం విఫలమైంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ఇతర నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగి ప్రజల జేబుకు ఎప్పటికప్పుడు చిల్లు పడుతోంది. పరిస్థితులు ఇలా ఉంటే.. మనదేశం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు వార్తలు రావటం విస్మయం కలిగిస్తోంది. ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే దానికి తగినట్లు దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు కూడా మారాలి. అదే అసలైన ఆర్థిక వృద్ధి. కానీ దేశంలో పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రజల తలసరి ఆదాయాల్లో చెప్పుకోదగిన మార్పు లేదని గణాంకాలు చెప్తున్నాయి. ఈ విషయంలో చాలా చిన్న దేశాలకంటే మనం వెనుకబడి ఉన్నాం. దాంతో దేశం సంపన్నమవుతోంది తప్పితే ప్రజలు మాత్రం కాదని అర్థమవుతున్నది. ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 4.187 ట్రిలియన్ డాలర్లతో నాలుగో స్థానానికి చేరింది. 4.186 ట్రిలియన్ డాలర్లతో జపాన్ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి దిగజారింది. అదే సమయంలో ఈ రెండు దేశాల మధ్య తలసరి ఆదాయాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. జపాన్ తలసరి ఆదాయం 33,900 డాలర్లు కాగా భారత ప్రజల తలసరి ఆదాయం 2,880 డాలర్లు మాత్రమే. అంటే రెండు దేశాల మధ్య నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని స్పష్టమవుతోంది. అలాగే భారత ప్రజల ఆదాయంలో పెద్దగా పెరుగుదల లేదని అర్థమవుతుంది. ఆర్థిక వ్యవస్థ, గణాంకాలు ఎలా ఉన్నా.. భారత్లో ధనిక, పేద అసమానతలు ఆందోళనకరంగా ఉన్నాయి. 2022 నాటి ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం భారత దేశ మొత్తం సంపదలో 40 శాతం కంటే ఎక్కువ వాటా దేశ జనాభాలో ఒకే ఒక్క శాతంగా ఉన్న అత్యంత సంపన్నవర్గాల చేతుల్లోనే ఉండిపోతున్నది. అదే సమయంలో అట్టడుగు స్థానంలో ఉన్న 50 శాతం ప్రజల చేతిలో కేవలం మూడు శాతం సంపద మాత్రమే ఉండటం ఆందోళన కలిగించే విషయం. మొత్తంగా పది శాతం మంది మాత్రమే మన జాతీయ ఆదాయంలో 57 శాతానికి పైగా సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు చెందిన ర్యాంకులతో దేశాభివృద్ధిని కొలవలేమని, సాధారణ పౌరుల ఆదాయాలు, జీవన ప్రమాణాలు మెరుగు పడటమే అసలైన అభివృద్ధికి సంకేతమని మేధావులు స్పష్టం చేస్తున్నారు. గణాంకాల గొప్పలతో ఉబ్బిపోకుండా ధనిక, పేద మధ్య ఉన్న ఈ లోతైన అసమానతల అంతరాన్ని రూపుమాపాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తెరగాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మన పక్కనే ఉన్న చైనా రెండో స్థానంలో ఉంది. 19.23 ట్రిలియన్ డాలర్లతో ఈ ఆసియా దేశం ప్రపంచంలో ఆధిపత్యం ప్రదర్శిస్తూ, తన పరిస్థితిని మెరుగుపరచుకుంటూ అగ్రస్థానంలో ఉన్న అమెరికాకే సవాలు విసురుతోంది. చైనా ఒకప్పుడు నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరినప్పుడు ఆ దేశ తలసరి ఆదాయం 3500 డాలర్లుగా ఉండేది. ప్రస్తుతం భారత్లో ఉన్న తలసరి ఆదాయం కంటే ఇది ఎక్కువే. ప్రస్తుతం చైనా తలసరి ఆదాయం 13 వేల డాలర్లుగా ఉంది. ఇది భారత తలసరి ఆదాయం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కావటం గమనార్హం. చైనాతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నామని చెప్పుకునే మోదీ సర్కారు.. ఈ విషయంలోనూ పోటీ పడితే దేశప్రజల ఆర్థిక స్థితిగతుల్లో గణనీయ మార్పు వస్తుంది.
Comments