లౌకికవాదం అంటే.. మతం నుంచి దూరం జరగడం కాదు!
- Guest Writer
- 2 days ago
- 2 min read

భారతదేశంలో లౌకికవాదం అంటే మతాన్ని ప్రజా జీవితం నుంచి దూరం చేయడం కాదు. ఉమ్మడి పౌర చట్టంలో అన్ని మతాలకు సమాన గౌరవం, సహజీవనం, ఆత్మగౌరవాన్ని కల్పించడం. వివిధ నాగరికతలు, చారిత్రక సందర్భాల మీదుగా ప్రయాణించి, వాటిని ఆకలింపు చేసుకోవడమే లౌకికవాద భావన. ఇది మతాన్ని తిరస్కరించదు. బదులుగా బహుళ విశ్వాసాలను గౌరవంగా, పరస్పర మర్యాదతో కలిపి ఒక చట్రాన్ని సృష్టిస్తుంది. ఐరోపాలో మత సంస్థల ఆధిపత్యం పరిపాలనను మత సిద్ధాంతంతో ముడిపెట్టింది. ఇది అధికారం, సిద్ధాంతం, రాజకీయ చట్టబద్ధతపై తీవ్రమైన పోరాటాలకు దారితీసింది. అందువల్ల, పశ్చిమ దేశాలలో లౌకిక రాజ్యాల ఆవిర్భావం అనేది రాజకీయ అధికారాన్ని మతపరమైన నియంత్రణ నుంచి వేరుచేసి, మతవిశ్వాస విషయాలతో కాకుండా పరిపాలన తటస్థంగా ఉండేలా చూసే ఒక ప్రయత్నం జరిగింది. కానీ భారతదేశ చారిత్రక గమనం చాలా భిన్నమైన మార్గంలో సాగింది. మన ఉపఖండంలో హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బౌద్ధం, జైనమతం, జొరాస్ట్రియనిజం వంటి అనేక అసాధారణ ఆధ్యాత్మిక మార్గాలకు నిలయంగా మారింది. ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకునే సంస్కతిని ముందుకు తీసుకెళ్లాయి. అందుకే భారతీయ సామాజిక వ్యవస్థలో ప్రజాజీవితం నుంచి మతాన్ని వేరుచేయడం ఎప్ప్పుడూ అవసరం కాలేదు. దానికి బదులు సంఘర్షణలోకి దిగకుండా వైవిధ్యాన్ని స్వీకరించగల ఒక తత్త్వం అవసరమైంది. ఈ చారిత్రక అనుభవం నుంచి లౌకికవాదంపై ఒక ప్రత్యేకమైన భారతీయ అవగాహన ఆవిర్భవించింది. భారతదేశంలో లౌకికవాదం అంటే మతరాహిత్యం కాదు.. లేదా విశ్వాసం పట్ల శత్రుత్వాన్ని సూచించదు. దానికి బదులుగా రాజ్యం అన్ని మతాల నుంచి సూత్రబద్ధమైన సమదూరాన్ని పాటిస్తూ, ప్రతి మతానికి సమాన గౌరవం, రక్షణ కల్పించాలనే విధానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. రాజ్యం పాత్ర మతపరమైన గుర్తింపును తుడిచివేయడం కాదు.. ఏ ఒక్క సంప్రదాయానికీ అనవసరమైన ప్రత్యేక హక్కులు లేదా వివక్ష లభించకుండా చూడటం. ఈ కోణంలో భారతీయ లౌకికవాదం అనేది మతబహిష్కరణ కన్నా సామరస్యపూర్వక సహజీవనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దీని మూలంలో సహనానికి, అంగీకారానికి మధ్య ఒక ముఖ్యమైన భేదం ఉంది. సహనాన్ని తరచుగా ఒక సద్గుణంగా ప్రశంసించినప్పటికీ, దానిలో ఒక సూక్ష్మమైన అహంభావం ఇమిడి ఉంటుంది. ఒక విషయాన్ని సహించడం అంటే, విభేదాలు ఉన్నప్పటికీ దానిని భరించడం. మానవ నమ్మకాలలోని వైవిధ్యం కేవలం భరించాల్సిన విషయం మాత్రమే కాదని, మానవాళి సమష్టి జ్ఞానాన్ని సుసంపన్నం చేసే అంశమని అది అంగీకరిస్తుంది. స్వామి వివేకానంద కంటే ఎక్కువ స్పష్టతతో ఈ వ్యత్యాసాన్ని వివరించిన మేధావులు చాలా తక్కువ. ప్రపంచ మతాల పార్లమెంటులో ఆయన చేసిన ప్రసిద్ధ ప్రసంగంలో భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం కేవలం సహనాన్ని బోధించడమే కాకుండా అన్నిమతాలను సత్యంగా అంగీకరిస్తుందని ప్రకటించారు. ఈ విస్తృత నాగరికతా చట్రంలో హిందూమతానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఒకే ప్రవక్త లేదా ఏకీకృత సిద్ధాంత నిర్మాణంపై ఆధారపడిన అనేక మత వ్యవస్థల్లా కాకుండా, హిందూతత్త్వం వేల సంవత్సరాలుగా సహజసిద్ధంగా అభివృద్ధి చెందింది. ఆస్తికత్వం, నాస్తికత్వం, వ్యక్తిగత భక్తి, అమూర్త తత్వం, కర్మకాండలు, తాత్విక విచారణలను స్వీకరించే మేధోపరమైన సౌలభ్యం దీనికి ఉంది. ఇటువంటి బహుళత్వం సంప్రదాయాన్ని బలహీనపరచదు. హిందూతత్వం చారిత్రాత్మకంగా విశ్వాస వైవిధ్యాన్ని ఒక ముప్పుగా కాకుండా, సహజమైన, సుసంపన్నం చేసే లక్షణంగా భావించే వాతావరణాన్ని పెంపొందించింది. ఈ స్ఫూర్తే చారిత్రాత్మకంగా హింసకు గురైన వారికి ఆశ్రయంగా ఎందుకు నిలిచిందో కూడా వివరిస్తుంది. ఇతర ప్రాంతాలలో మతపరమైన అణచివేత నుంచి పారిపోయి వచ్చిన సమూహాలు భారత గడ్డపై ఆశ్రయం పొందాయి, ఇక్కడ వారు తమ విశ్వాసాన్ని, సంప్రదాయాలను కాపాడుకోగలిగారు. విభిన్న మత సమాజాలు పక్కపక్కనే జీవించడం భారత నాగరికత ఒక శాశ్వత లక్షణంగా నిలిచింది. లౌకికవాదాన్ని మత వ్యతిరేకతగా కాకుండా, ఒక ఉమ్మడి పౌర వ్యవస్థలో అనేక మతాల సామరస్య సమన్వయంగా అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక వైవిధ్యం మానవ సమాజంలో ఒక శాశ్వత లక్షణమని, ఈ వైవిధ్యాన్ని గౌరవంతో, నిష్పక్షపాతంగా గుర్తించినప్పుడే శాంతి వర్ధిల్లుతుందని గ్రహించడంలో దీని మూలాలు ఉన్నాయి. ఈ చట్రంలో రాజ్యం విశ్వాసానికి మధ్యవర్తిగా కాకుండా, సమానత్వానికి సంరక్షకుడిగా మారుతుంది. ఈ విశిష్టమైన లౌకికవాద నమూనాకు భారతదేశం వెలుగునిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సమాజాలు గుర్తింపు, విశ్వాసం, సహజీవనం వంటి ప్రశ్నలతో సతమతమవుతున్న ఈ యుగంలో, భారతీయ అనుభవం ఒక శాశ్వతమైన పాఠాన్ని అందిస్తుంది. ఐక్యతకు ఏకరూపత అవసరం లేదని, తన పునాదులపై విశ్వాసం ఉన్న నాగరికత నిర్భయంగా వైవిధ్యాన్ని స్వీకరించగలదని. ఈ కోణంలో నిజమైన లౌకికవాదం అంటే విశ్వాసాన్ని అణచివేయడం కాదు, అనేక విశ్వాసాలు జీవించి, వృద్ధిచెంది సమాజానికి దోహదపడగల ఒక పౌర సంస్కృతిని సృష్టించాలి.
- నౌపడ సత్యనారాయణ






Comments