top of page

విద్యా వ్యవస్థలు మారితేనే అవస్థలు తీరు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 days ago
  • 2 min read

విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతించింది. జాతీయ విద్యా విధానం-2020(ఎన్‌ఈపీ) సిఫార్సుల ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉన్నత విద్య ప్రపంచీకరణ వైపు వేసిన తొలి అడుగుగా చెప్పవచ్చు. అదే సమయంలో భారతీయ విద్యాసంస్థలు విదేశీ విద్యాసంస్థలతో పోటీ పడేందుకు ద్వారాలు తెరుస్తుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ మార్గంలో అనేక సవాళ్లు, తీవ్ర అడ్డంకులు ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వీటిని పరిష్కరించకుండా అంతర్జాతీయంగా పోటీ పడటం మన ఉన్నత విద్యాసంస్థలకు కత్తి మీద సాములా మారుతుంది. ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం, మెరుగైన అవకాశాలు, మానవ వనరులు సక్రమ నిర్వహణ వంటి లోపాలను అధిగమించకుండా పోటీ పడితే.. పరిస్థితి మరింత దిగజారవచ్చు. దేశంలో మెజారిటీ ఉన్నత విద్యాసంస్థలు తమకు మంజూరైన స్టాఫ్‌ ప్యాటర్న్‌లో 40 నుంచి 50 శాతం సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి. మరోవైపు ప్రతిభ, వృత్తి నైపుణ్యాలు పుష్కలంగా ఉన్న అధ్యాపకులు, ఇతర ఉన్నతోద్యోగులు భారతీయ సంస్థలను వీడి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, కార్పొరేట్‌ విద్య, విద్యేతర సంస్థల్లో చేరిపోతున్నారు. విద్యాసంస్థల మనుగడకు అధ్యాపకవర్గమే అత్యంత కీలకం. కానీ మన ఉన్నత విద్యాసంస్థలకు ఉన్న అనేక పరిమితుల కారణంగా నాణ్యమైన అధ్యాపకులను నియమించడం సవాలుగా మారుతోంది. పరిమిత నిధులు, లోపభూయిష్టమైన ఎంపిక ప్రక్రియ వంటివి ప్రధాన అవరోధాలుగా ఉన్నాయి. ఉన్నత విద్యాసంస్థల్లో నియామక ప్రక్రియ కేంద్రీకృతమై ఉండటం, ఎంపిక ప్రక్రియ సరళంగా లేకపోవడం వల్ల నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనివల్ల ప్రతిభావంతులైన అభ్యర్థులు వేరే సంస్థల్లో చేరిపోతున్నారు. ప్రభుత్వ నిధులు, మార్గదర్శకాలతో నడిచే ఉన్నత విద్యాసంస్థల్లో ప్రతి చిన్న అంశాన్ని ఆ ప్రమాణాల చట్రంలోనే చూస్తారు. దీని వల్ల చాలా సందర్భాల్లో వృత్తి నిపుణులను, ప్రతిభావంతులైన అధ్యాపకులను కాపాడుకోవడం కష్టసాధ్యమవుతోంది. ఇటువంటి వారికి ఇచ్చే ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు ఆకట్టుకునేలా ఉండాలన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు. మన విద్యాసంస్థల్లో తరచూ ఉద్యోగ ఖాళీలు పెరిగిపోతుండటం సాధారణం. ఆయా వ్యవస్థలు అనుసరిస్తున్న నియామక విధానాలే దీనికి కారణం. విదేశీ సంస్థల్లో రిటైర్‌మెంట్లు, ఇతర కారణాల వల్ల ఉద్యోగులు, అధ్యాపకుల పోస్టులు ఖాళీ అవుతున్నాయంటే చాలు.. ఆ ఖాళీలు ఏర్పడకముందే ఆ స్థానాలకు కొత్తవారిని నియమించి రెడీగా ఉంచుతారు. కానీ మనదేశంలోని విద్యాసంస్థల్లో ఖాళీలు ఏర్పడిన తర్వాతే నియమాక ప్రక్రియ మొదలవుతుంది. కొత్తగా వచ్చిన వారికి ఇంతవరకు ఆ పోస్టులో ఉన్నవారు ఏం చేశారు, దాని కొనసాగింపుగా ఏం చేయాలన్నది తెలియదు. వాటిని అర్థం చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది. ఇది విద్యాప్రగతిని కుంటుపరుస్తుంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా విద్యాసంస్థల్లో మానవ వనరుల నిర్వహణ పద్ధతులను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యా వ్యవస్థను మార్చడానికి ఎన్‌ఈపీ`2020 ఒక కీలకమైన బ్లూప్రింట్‌. ఇది పద్ధతులను మార్చడానికి, సమర్థులైన అధ్యాపకులు, సిబ్బందిని ప్రేరేపించడానికి మరియు శక్తివంతం చేయడానికి ప్రోత్సాహక పథకాలను అన్వేషించడానికి అనేక సిఫార్సులను అందిస్తుంది. నూతన జాతీయ విద్యా విధానం ఈ లోపాలను చాలా వరకు గుర్తించింది. వాటిని అధిగమించడానికి తగిన పరిహారాలను, ప్రత్యామ్నాయాలను కూడా సూచించింది. ఎంపిక ప్రమాణాలను మెరుగుపరిచి ఫాస్ట్‌ ట్రాక్‌ విధానాన్ని సూచించింది. బోధన, పరిశోధన సిబ్బంది నియామకాల్లో అధ్యాపక ప్రతినిధులు నిర్ణయాత్మక పాత్ర పోషించాలని సూచించింది. ఉద్యోగులను, ముఖ్యంగా అధ్యాపక బృందాన్ని నిలుపుకోవడంలో పని వాతావరణం కీలక పాత్ర పోషిస్తుంది. వారికి వృత్తిపరమైన స్వేచ్ఛ కల్పించడం చాలా కీలకం. ఈ వ్యవస్థ మేధో జ్ఞానాన్ని కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా సరైన ఉద్యోగానికి సరైన వ్యక్తిని నియమించడంలో కూడా సహాయపడుతుంది. ప్రమోషన్‌ మరియు కెరీర్‌ పురోగతి, వార్షిక ఇంక్రిమెంట్లు, శిక్షణ సదరు ఉద్యోగి పనితీరుతో కచ్చితంగా ముడిపడి ఉండాలి. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో చోటు సంపాదించడానికి, మన విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో నిలపడానికి జాతీయ విద్యా విధానం సిఫార్సులను కచ్చితంగా అమలు చేసి మన విద్యాసంస్థలను మరింత ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page