సొంత అజెండాతో బదిలీల దందా!
- BAGADI NARAYANARAO
- 4 days ago
- 3 min read
పలు శాఖల్లో అధికారులదే ఇష్టారాజ్యం
కౌన్సెలింగుల్లేకుండా ఇష్టారాజ్యంగా జాబితాలు
సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల్లో ఉద్యోగ నేతల ద్వారా తతంగం
రాష్ట్ర నేతనంటూ మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ సీసీ పైరవీలు

బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చి మార్గదర్శకాలు జారీ చేసినా జిల్లా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరికి నచ్చినట్లు వారు సొంత లాభం చూసుకుని ఇష్టారాజ్యంగా బదిలీల జాబితాలు సిద్ధం చేస్తున్నాట్లు ఆరోపణలు జోరందుకున్నాయి. ఈ వ్యవహారంలో ఉత్తర, దక్షిణలు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. కొందరు మాజీలు ఉద్యోగ సంఘాల నాయకులమంటూ బదిలీ దందాలో కాసుల వేట సాగిస్తున్నారని తెలిసింది. మే 16 నుంచి జూన్ 2 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఒకేచోట ఐదేళ్లుగా ఉంటున్నవారిని కచ్చితంగా బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నా చాలా శాఖల అధికారులు ఆ మేరకు బదిలీ ప్రక్రియ చేపట్టడంలేదు. ఒకేచోట ఐదేళ్లలోపు ఉన్న ఉద్యోగులకు రిక్వెస్ట్ బదిలీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఏడాది మే 31లోపు రిటైర్ అయ్యే వారికి బదిలీల నుంచి మినహాయించారు. అంధ ఉద్యోగులు, మానసిక సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులకు, ట్రైబల్ ఏరియాలో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేసినవారికి, మెడికల్ గ్రౌండ్లో బదిలీలు కోరేవారికి, వితంతు ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవాలని, అలాగే స్పౌజ్ కేటగిరీలోని వారికి ఒకేచోట లేదా దగ్గరి ప్రాంతాల్లో పని చేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే దీనిపై ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో బదిలీ కోరుకునేవారు ఎవరికివారుగా ప్రయత్నిస్తూ.. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు సమర్పించినా కోరుకున్న చోటుకు బదిలీ అవుతుందన్న గ్యారెంటీ లేదని ఉద్యోగవర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా కొన్ని శాఖల్లో ఉద్యోగ సంఘాల నాయకులే ఎవరిని ఎక్కడికి బదిలీ చేయాలో సూచిస్తూ జాబితాలు తయారుచేసి జిల్లా అధికారులకు సమర్పించేశారు.
కౌన్సెలింగ్ లేకుండానే జాబితా
చాలా శాఖల్లో మంత్రి, ఎమ్మెల్యేల సిఫార్సులు ఉన్నా.. డబ్బులు సమర్పించి బదిలీ ఆర్డర్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంలో సాంఘిక, బీసీ సంక్షేమ శాఖలు మొదటి వరుసలో ఉన్నాయి. ఈ శాఖల అధికారులకు ప్రభుత్వ మార్గదర్శకాలు పట్టవు. ఉద్యోగ సంఘాల ద్వారా కలెక్షన్లు చేయించి, ఆ ప్రకారం బదిలీల జాబితాను తయారు చేయించేశారు. దీని కోసం ఆయా శాఖల అధికారులు రహస్య సమావేశాలు నిర్వహించారు. ఈ శాఖల్లో మార్గదర్శకాలను పక్కన పెట్టి బదిలీలు చేస్తున్నట్టు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖలో డీడీ విశ్వమోహన్రెడ్డి, సూపరింటెండెంట్ జగన్మోహనరావు తమకు కావలసినవారితో బదిలీల జాబితా రూపొందించి కలెక్టర్కు పంపించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీరో సర్వీస్ను పరిగణనలోకి తీసుకొని బదిలీ చేస్తున్నట్టు ఆ శాఖ అధికారులు చెబుతున్నా టెక్కలి, రణస్థలం, ఆమదాలవలస, బారువ వసతిగృహాల అధికారులను మాత్రం మినహాయించారని తెలిసింది. ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించకుండానే బదిలీ జాబితా తయారు చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులన్న సాకుతో కొందరిని బదిలీల నుంచి మినహాయించారు. డబ్బులిచ్చిన మరికొందరిని వారి సొంత ఇలాఖాల్లోని వసతిగృహాల్లో కొనసాగేలా కౌన్సెలింగ్ లేకుండానే బదిలీ జాబితాలో చేర్చారు. అదే సమయంలో దీన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగులను గిరిజన ప్రాంతాలకు బదిలీ చేస్తూ జాబితాలో చేర్చారని తెలిసింది. కూటమి నాయకులు, ఉన్నతాధికారులు చెప్పినా పట్టించుకోనని అంటున్న సాంఘిక సంక్షేమశాఖ డీడీ విశ్వమోహన్రెడ్డి తమ శాఖ జిల్లా కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన వారిని మాత్రం బదిలీ చేయడం లేదంటున్నారు. ఇటీవల తనపై ఫిర్యాదు చేసిన వారిపై బదిలీ వేటు వేసేందుకు డీడీ విశ్వమోహన్రెడ్డి సిద్ధపడినట్లు తెలిసింది. డీడీపై కలెక్టరేట్ అధికారులు విచారణ జరిపి నివేదిక ఇచ్చినా కలెక్టర్ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
డీఆర్వోకు అప్పగించినా ఆమె చెప్పినట్లే..
బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ శాఖకు చెందిన బదిలీల కౌన్సెలింగ్ బాధ్యతను డీఆర్వోకు కలెక్టర్ అప్పగించారు. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులుగా చెలామణీ అవుతున్న వైకుంఠరావు, రాజారావు, గోపాలరావులను రంగంలోకి దించి గురువారం వార్డెన్లతో ఎన్జీవో హోంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అయితే దీనికి పలువురు దూరంగా ఉన్నారు. వచ్చినవారు కూడా ఎవరు.. ఎక్కడికి బదిలీ కోరుకున్నారన్నది చర్చించి వెళ్లిపోయారు. అయితే డబ్బులు ఇచ్చినవారికి పోస్టింగ్ ఇస్తున్నందున ఆ స్థానాల్లో వేరెవరూ బదిలీ కోరుకోవద్దని వార్డెన్లకు డీబీసీడబ్ల్యూవో అనురాధ అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది. ఈ వ్యవహారమంతా వార్డెన్ల సంఘం నాయకులు కనుసన్నల్లోనే జరుగుతోందని ఆ శాఖలోనే ప్రచారం ఉంది. డీఆర్వోకు ఇచ్చిన బదిలీల కౌన్సెలింగ్ జాబితాను అనురాధే తయారు చేయించారని ప్రచారం జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుల ప్రకారమే జాబితా రూపొందించామని ఉన్నతాధికారులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కారుణ్య నియామకాల్లో డీబీసీడబ్ల్యూవో అనురాధ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు రావడంతో ఆమెపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో ఆమె బదిలీల కౌన్సెలింగ్కు దూరంగా ఉంటారని అందరూ సంబరపడ్డారు. కానీ ఆమె ఉన్నతాధికారులను మేనేజ్ చేసి డీఆర్వోతో పాటు తాను కూడా కౌన్సెలింగ్లో పాల్గొంటానని ఉద్యోగులందరికీ సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో కోరుకున్న చోటుకు బదిలీ కావల్సినవారు డబ్బులు సమర్పించుకొని ఆర్డర్లు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది.
మాజీ ఉద్యోగ నేతల పైరవీలు
వైద్యఆరోగ్య శాఖలో ఉద్యోగ సంఘాల మాజీ, ప్రస్తుత నాయకులు రంగంలోకి దిగారు. గతంలో ఉద్యోగ సంఘాల్లో కీలక పదవులు చేసి రిటైరైన వారు కూడా డిపార్ట్మెంటులో తమ ప్రాబల్యం తగ్గలేదని నిరూపించుకొనే పనిలో పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో అనుకూలమైన బదిలీలు కోరుకుంటున్న ఉద్యోగులు వారి చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదనుగా మరికొందరు డబ్బులు దండుకొని వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై ఉద్యోగ సంఘాల పేరుతో ఒత్తిడి తెచ్చి బదిలీల కోసం సిఫార్సులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పేరుతో లెటర్హెడ్స్ ఇచ్చి బదిలీల నుంచి మినహాయింపు పొందడానికి కూడా కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శినంటూ టీడీపీ హయాంలో జెడ్పీ చైర్పర్సన్ వద్ద సీసీగా చేసిన సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సంతోష్ ఉద్యోగుల బదిలీల పేరుతో హడావుడి చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర కార్యదర్శినంటూ లెటర్ హెడ్ ముద్రించుకుని, దాన్ని అధికారులకు చూపించి బదిలీల నుంచి పలువురికి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయా శాఖల జిల్లా అధికారులకు సిఫార్సు చేసినట్టు తెలిసింది.
Comentarios