సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడాలి
- SATYAM DAILY
- Sep 4, 2025
- 1 min read
పాలక మండలి సభ్యులు ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే శంకర్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

సనాతన ధర్మ పరిరక్షణకు అందరూ పాటుపడాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. గురువారం నగరం చిన్నబజార్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం (దూదివారి కోవెల), కొన్నవీధి భీమేశ్వరాలయం, తుమ్మావీధి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు నూతనంగా ఏర్పాటైన పాలకమండలి సభ్యులతో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. దేవాలయాల పురాతన నిర్మాణాలను, సంస్కృతి ప్రాధాన్యతను కాపాడుకోవాలని, భవిష్యత్ తరాలకు వీటికి అందించాలని సూచించారు. దేవాలయాల పరిరక్షణతో పాటు వాటి భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శతాబ్దాల చరిత్ర, ఆధ్యాత్మికతకు సాక్ష్యంగా నిలిచే పురాతన దేవాలయాలను సంరక్షించుకునే బాధ్యతను పాలకమండలి సభ్యులు తీసుకోవాలన్నారు. మన సంస్కృతిక వారసత్వానికి ఆనవాలుగా నిలిచే ఆలయాలను రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆలయాలు లలితకళలకు నిలయాలుగా ఉండేవని, సనాతన ధర్మ పరిరక్షణకు ఆలయాలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. నేటి ఆధునిక యుగంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఆలయాలు సందర్శించాలని సూచించారు. భక్తిమార్గంలో నడిచేవారు క్రమశిక్షణతో మెలుగుతారని ఈ సందర్భంగా వివరించారు. అనంతరం ఎసీ ప్రసాద్ పట్నాయక్, ఎగ్జిక్యూటివ్ అధికారి పి.మాధవితో కలసి పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో భీమేశ్వరాలయం పాలక మండలి చైర్మన్ వంగా మహేష్, సభ్యులు కర్రి సతీష్ రెడ్డి, దూదివారి కోవెల ట్రస్టు చైర్పర్సన్ సానా హరిత, కె.గంగాధర్, లక్ష్మీ గణపతిశర్మ, పద్మావతి, శశిభూషణరావు, ప్రియలక్ష్మీ, ఎస్.ధర్మారావు, టీడీపీ నాయకులు అంధవరపు సంతోష్, ప్రసాద్, కోరాడ హరిగోపాల్, ఇప్పిలి తిరుమలరావు, నారాయణశెట్టి కిరణ్, కాకర్ల ప్రదీప్, నటుకుల మెహన్, శ్రీకాంత్ రెడ్డి, బొట్టా రాంబాబు, కలగ రమేష్, చల్లా రమణ, ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










Comments