సర్వేల సారం ఇంతేనయా!
- BAGADI NARAYANARAO

- 15 hours ago
- 2 min read
ఏడాదిన్నర కాలంలోనే నాలుగు రకాల సేకరణ
అన్నింట్లోనే సేకరించే సమాచారం దాదాపు ఒక్కటే
ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్యామిలీ సర్వే గడుపు పొడిగింపు
సంక్షేమ పథకాలకు భవిష్యత్తులో ఈ డేటాయే కొలమానం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్రంలో ప్రజల నుంచి రకరకాల పేర్లతో వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో సర్వే పేరుతో సేకరిస్తున్న ఈ సమాచారాల్లో వివరాలన్నీ దాదాపు ఒక్కటే కావడంతో వాటిని క్రోడీకరించలేక సంబంధిత సిబ్బంది అవస్థలు పడుతున్నారు. గత ఏడాది వర్క్ఫ్రమ్ హÃం పేరుతో సర్వే చేసి ఇళ్లలోని సభ్యులందరి వివరాలు సేకరించారు. కుటుంబంలో 10 ఆపై చదివి, నైపుణ్యం కలిగినవారి వివరాలు సేకరించి, వివిధ సంస్థల ద్వారా ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించడం ఈ సర్వే లక్ష్యంగా పేర్కొన్నారు. వర్క్ ఫ్రం హÃంకు పేర్లు నమోదు చేసుకున్నవారికి సంబంధిత సచివాలయాల్లో 40 నిమిషాల ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇది కొనసాగుతుండగానే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే`2026 (యూఎఫఎస్) పేరుతో గత ఏడాది డిసెంబర్ 15 నుంచి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ డేటాతో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు చేరడంతో పాటు, ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుల జారీ సులభతరం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. నెల రోజుల్లో పూర్తి చేయాలంటూ జనవరి 12ను తుది గడువుగా నిర్దేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు సార్లు ఇలా వివరాలు సేకరించారు. ఈ నాలుగు సర్వేల లక్ష్యం ఒక్కటేనని అధికారులు చెబుతున్నారు.
సమస్యలతో జాప్యం
ఫ్యామిలీ సర్వే ప్రధాన ఉద్దేశం ప్రతి కుటుంబానికి డిజిటల్ రికార్డును రూపొందించడం, ఆ వివరాలతో ఫ్యామిలీ కార్డు అందించడం, సంక్షేమ పథకాల్లో పారదర్శకత తీసుకురావడమేనని ప్రభుత్వం చెబుతున్నారు. అర్హులైనవారు సంక్షేమ పథకాలకు దూరం కాకుండా చూడటం, అనర్హులను తొలగించడానికి కూడా ఈ సర్వే ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం సచివాలయాల సిబ్బంది ఈ సర్వే పనుల్లోనే తలమునకలై ఉన్నారు. ఇందుకోసం వారికి ప్రభుత్వం ట్యాబ్లు, ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ యాప్లు సమకూర్చింది. సంక్షేమ పథకాý పథకాల అమలుకు భవిష్యత్తులో ఈ డేటా ఆధారంగానే లబ్ధిదారులను గుర్తిస్తారు. ఈ సర్వేలో ప్రధానంగా ఆధార్, మొబైల్ నెంబర్లతోపాటు విద్య, ఉపాధి, ఆదాయం, ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యలు, పని ఒత్తిడి కారణంగా గడువు ముగిసి నెల రోజులైనా జిల్లాలో ఇప్పటివరకు 67 శాతం కుటుంబాలనే సర్వే చేయగలిగారు. మొత్తం 7.36 లక్షల కుటుంబాలకు గాను 4.90 లక్షల కుటుంబాల సర్వే పూర్తి అయ్యింది. శ్రీకాకుళం డివిజనల్లో 3.47 లక్షలు కుటుంబాలకు 2.39 లక్షలు, టెక్కలి డివిజన్లో 2.02 లక్షల కుటుంబాలకు 1.34 లక్షలు, పలాస డివిజన్లో 1.85 లక్షలకు 1.25 లక్షల కుటుంబాల లక్ష్యం పూర్తి అయ్యింది. ఈ నెలఖరు నాటికి సర్వే పూర్తి చేయాలని తాజాగా గడువు విధించారు. అయితే సర్వే జరిగే సమయంలో కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడం వల్ల వివరాల సేకరణలో జాప్యం జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. చాలామంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం మరో సమస్య. అధికారుల ఆదేశాలతో ఇటువంటి వారందరినీ వలస వెళ్లినవారిగా డేటాబేస్లో నమోదు చేస్తున్నారు. కాగా ఈ సర్వే పూర్తి అయిన సంక్షేమ పథకాల్లో అనర్హులుగా తేలిన వారిని తొలగించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.










Comments